వైఎస్ జగన్ అలా చేయకుండా ఉండాల్సింది.. అందరికీ అవకాశం ఇచ్చినట్లైంది??
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా చేయకుండా ఉండాల్సిందని.. అందరికీ అవకాశం ఇచ్చినట్లైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీకి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. రాజీనామా ప్రకటన చేసే సమయంలో నాయకులు, కార్యకర్తలు నివ్వెరపోగా జగన్ చప్పట్లు కొట్టడమనేది ఇప్పుడు ఏపీ మొత్తం చర్చనీయాంశంగా మారింది.
సందర్భానికి అనుగుణంగా స్పందించడం మనిషి నైజమని, తాను వేరే బాధ్యతలు నిర్వర్తించాలనుకున్నారు కాబట్టి రాజీనామా చేస్తున్నానన్నారని, కాబట్టి ఆమె నిర్వహించబోయే కొత్త బాధ్యతలకు సంబంధించి జగన్ స్పందించి చప్పట్లు కొట్టారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
గుంటూరు-విజయవాడ మధ్య జాతీయ రహదారిపై రెండురోజులపాటు జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వేదికపైనే తన రాజీనామాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే ఆమె నిర్ణయాన్ని జగన్ చప్పట్లు కొడుతూ స్వాగతించారని, అందులో తప్పు పట్టాల్సిన అంశం లేదని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. దీన్ని ఎక్కువగా చేసి చూపించాల్సిన అవసరం లేదని, తమకు వ్యతిరేకంగా ఉండే మీడియానే ఇలా చేస్తోందంటూ మండిపడుతున్నారు.
ఈ పరిణామంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తనకున్న 11 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధాన్ని వదులుకున్నారు. తన కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీతో బిజీగా ఉన్నారని, ఆమెకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు. షర్మిల పార్టీ స్థాపించి సరిగ్గా సంవత్సర కాలం పూర్తిచేసుకున్న సమయంలోనే విజయమ్మ రాజీనామా చేయడం గమనార్హం.