తీర్మానం పెడ్తాం: విజయమ్మ, వారు ద్రోహులు: రోజా
హైదరాబాద్/ తిరుపతి: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తీర్మానాన్ని తాము శాసనసభలో ప్రతిపాదిస్తామని వైయస్సార్ కాంగ్రెసు శానససభా పక్ష నేత వైయస్ విజయమ్మ చెప్పారు. తమ తీర్మానానికి ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటామని ఆమె చెప్పారు. శాసనసభ సలహా సంఘం (బిఎసి) సమావేశం నుంచి వాకౌట్ చేసిన తర్వాత ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టాలనే తమ ప్రతిపాదనకు ప్రభుత్వం వ్యతిరేకత తెలపడంతో తాము వాకౌట్ చేసినట్లు ఆమె తెలిపారు.
అన్ని సమస్యల కన్నా రాష్ట్ర విభజనే అతి పెద్ద సమస్య అని ఆమె అన్నారు. తుఫానుల నష్టాలు, కరెంట్ కష్టాలు, కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అంశాలపై చర్చకు కూడా తాము డిమాండ్ చేసినట్లు ఆమె తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆమె విమర్శించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజన ద్రోహులని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, సినీ నటి రోజా వ్యాఖ్యానించారు. నగరిలో రోజా నాయకత్వంలో బుధవారం రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు సమైక్యవాదాన్ని వినిపిస్తూ తెర వెనక యుపిఎ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆమె విమర్శించారు.
సమైక్యం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని రోజా అన్నారు. జగన్ ఇప్పటికే చాలా పార్టీల మద్దతు కూడగట్టారని ఆమె చెప్పారు. సమైక్య రాష్ట్రం జగన్ వల్లనే సాధ్యమవుతుందని రోజా చెప్పారు.












Click it and Unblock the Notifications