ప్లీనరీకి విజయమ్మ హాజరుపై క్లారిటీ : పార్టీలో పదవిపై సవరణ వెనుక : 2024 ఎన్నికల వేళ..!!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి ప్లీనరీ జరగబోతోంది. జూలై 8, 9 తేదీల్లో నిర్వహణకు నిర్ణయించారు. ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో తిరిగి విజయం దక్కించుకోవటమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్లీనరీ వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. కీలక నిర్ణయాలు - పార్టీ పరంగా తీర్మానాలకు ఈ ప్లీనరీ వేదిక కానుంది. ఇక, ఈ ప్లీనరీకి పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉన్న విజయమ్మ హాజరు పైన కొద్ది రోజులుగా అనేక చర్చలు తెర మీదకు వస్తున్నాయి.

పార్టీ పదవుల్లో మార్పులకు నిర్ణయిస్తారా
ఎక్కువగా కుమార్తె షర్మిలతోనే ఉంటున్న విజయమ్మ..వైసీపీ గౌరవాధ్యక్షురాలి హోదా నుంచి తప్పుకొనేందుకు సిద్దమయ్యారని ప్రచారం సాగింది. అయితే, ప్లీనరీ తరువాత నిర్ణయం ప్రకటిస్తారనేది ఆ ప్రచార సారాంశం. అయితే..పార్టీ నేతలు ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. అటు కుమార్తె కోసం తల్లిగా మద్దతుగా నిలిచిన విజయమ్మ.. వైసీపీ గౌరవాధ్యక్షురాలి హోదాలో ప్లీనరీకి హాజరు అవుతారంటూ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీని పైన మరో చర్చ అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో.. ప్లీనరీ వేదికగా మరో కీలక నిర్ణయం ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ వైసీపీ అధినేతగా ఉన్నారు.

విజయమ్మ హాజరు పైన క్లారిటీ
మారుతున్న సమీకరణాల నేపథ్యంలో జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రతిపాదించి.. వైసీపీ బైలాస్ లో సవరణ చేసే దిశగా పార్టీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ ఆలోచనకు అనుగుణంగా జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా తీర్మానం చేస్తే.. ఆటో మేటిక్ గా విజయమ్మ కూడా శాశ్వత గౌరవ అధ్యక్షురాలు అవుతారు. అయితే, దీని పైన సీఎం జగన్ తన పారిస్ పర్యటన నుంచి వచ్చిన తరువాత తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. వచ్చే నెల 4న ప్రధాని ఏపీ పర్యటన ముగిసిన తరువాత సీఎం జగన్ పార్టీ ప్లీనరీ నిర్వహణ - ఏర్పాట్లు - తీర్మానాల పైన సమీక్ష చేయనున్నారు. ప్లీనరీ వేదికగా.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు - గత మూడేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అనే అంశం పైన చర్చ చేయనున్నారు.

సీఎం జగన్ కీలక ప్రకటనల దిశగా
అవసరమైన మార్పులు సైతం అందరి సమక్షంలోనే నిర్ణయించాలని..ఇందులో వెనుకడుగు లేదని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. రెండు రోజుల ప్లీనరీలో దాదాపుగా 15 వరకు తీర్మానాలు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇక, ప్లీనరీ ప్రారంభం - ముగింపు సమయాల్లో సీఎం జగన్ కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఇక, గతంలో పాదయాత్ర ప్రకటనతో పాటుగా నవరత్నాలను పార్టీ ప్లీనరీ వేదికగానే జగన్ ప్రకటన చేసారు. ఈ సారి సీఎం హోదాలో ప్లీనరీలో సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు కేడర్ ను సమాయత్తం చేసే దిశగా కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో.. సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి పార్టీ వర్గాల్లో మొదలైంది.












Click it and Unblock the Notifications