ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు: ఎల్లుండే
అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసును విచారిస్తోన్న సీబీఐ అధికారులు ఇప్పటికే కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఈ కేసులో అవినాష్ రెడ్డి ఆరుసార్లు సీబీఐ అధికారుల విచారణకు హాజరయ్యారు. శుక్రవారమే మరో దఫా విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ- తల్లి లక్ష్మమ్మ అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్లారు. తల్లిని కర్నూలులోని విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటోన్నారు.

ఫలితంగా సీబీఐ అధికారుల విచారణకు హాజరు కాలేకపోయారు. గతంలో విచారణకు హాజరైనప్పుడే తాను అన్ని విషయాలను సీబీఐ అధికారులకు తెలియజేశానని అవినాష్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తన వద్ద ఉన్న సమాచారం మొత్తాన్నీ వారికి వివరించానని, ఇందులో దాచిపెట్టాల్సిన అంశాలేవీ లేవని పేర్కొంటోన్నారాయన.
శుక్రవారం నాటి విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో సీబీఐ అధికారులు ఇవ్వాళ తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులను జారీ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఈ నెల 22వ తేదీన అంటే- సోమవారం నాడు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలకు తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని సూచించారు.
ఈ విచారణకు అవినాష్ రెడ్డి హాజరవుతారా? లేదా? అనేది తెలియరావాల్సి ఉంది. అనారోగ్యానికి గురైన తల్లిని బాగోగులను చూసుకుంటోన్న పరిస్థితుల్లో ఆయన విచారణకు హాజరు కాలేకపోవచ్చని చెబుతున్నారు. మరోసారి వాయిదా కోరే అవకాశం ఉందని సమాచారం. దీనికోసం అవసరమైతే న్యాయస్థానాల నుంచి కూడా అనుమతి తీసుకోవచ్చని తెలుస్తోంది. ఆసుపత్రి నుంచి తల్లి డిశ్చార్జ్ అయ్యేంత వరకూ విచారణకు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న హైప్రొఫైల్ మర్డర్ కేసు ఇది. 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దాన్ని ఆయన తోసిపుచ్చారు.
హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. వైఎస్ వివేకా ఇంటి వాచ్మన్ రంగయ్య, సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిల పేర్లను చేర్చారు.












Click it and Unblock the Notifications