వివేకా హత్య కేసులో సాక్షి మృతి -అనుమానాస్పద రీతిలో : గతంలో సీబీఐపై ఫిర్యాదు..!!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిఅనుమానాస్పద రీతిలో మృతిచెందారు. గంగాధర్ రెడ్డి ఈ కేసులో సాక్షిగా ఉన్నారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో ఆయన మరణించారు. అయితే, ఈ మరణం అనుమానాస్పదంగా చెబుతున్నారు. గంగాధర్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నారని కుటుంబ సభ్యుల వాదన. నిద్రపోయిన సమయంలో అనారోగ్యంతోనే గంగాధర్రెడ్డి మృతిచెందినట్లు అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివేకా హత్య కేసులో సీబీఐ ఇప్పటికే మూడుసార్లు గంగాధర్రెడ్డిని విచారించింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్రెడ్డికి గంగాధర్రెడ్డి అనుచరుడు. అయితే.. గంగాధర్ రెడ్డి స్వగ్రామం పులివెందుల కాగా.. ప్రేమ వివాహం చేసుకుని యాకిడిలో ఉంటున్నారు. సీబీఐ అధికారులు బెదిరించి ఏకపక్షంగా సాక్షం చెప్పంటున్నారని గతం లో ఎస్పీ కి గంగాధర రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని రెండుసార్లు ఎస్పీని కలిసారు. గంగాధర్ రెడ్డి మరణం పై పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు.
ఆయన మృతి నేపథ్యంలో క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి ఇంటి పరిసరాలను పరిశీలిస్తోంది. ఇక, అటు సీబీఐ పులివెందులలో వివేకా హత్య కేసు విచారణ ముమ్మరం చేసింది. వివేకా ఇంటి కొలతలతో పాటుగా... మరి కొందరు అనుమానితుల సమాచారం సేకరిస్తోంది. ఇప్పటికే అప్రూవర్ గా మారిన దస్తగిరి కీలకంగా మారారు. రాజకీయంగానూ ఆరోపణలకు కారణమైన ఈ కేసులో ఇప్పుడు సాక్షిగా ఉన్న గంగాధర రెడ్డి అనుమానస్పద మరణం పైన పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది.