ఎదురు చూశాం: వైయస్ వివేకా, జైలు గేటెక్కిన రాజేష్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన చంచల్గూడ జైలు నుండి విడుదల కావడంపై ఆయన బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి స్పందించారు. మంగళవారం జగన్ విడుదల సందర్భంగా ఆయన ఇతర నేతలతో పాటు జైలు వద్దకు వచ్చారు.
జగన్ విడుదల తమకు ఎంతో సంతోషకరమైన వార్త అని, పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులమంతా ఆయన విడుదల కోసం ఉత్కంఠగా ఎదురు చూశామని చెప్పారు. ఇది నిజంగా తమకు అద్భుతమైన, సంతోషకరమైన రోజు అని వైయస్ వివేకానంద రెడ్డి చెప్పారు.

కాగా, జగన్ 485 రోజుల తర్వాత జైలు నుంచి ఇల్లు చేరుకున్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, నేతల హడావుడి, హల్చల్ నడుమ చంచల్గూడ జైలు నుంచి లోటస్పాండ్లోని తన నివాసందాకా ర్యాలీగా కదలి వచ్చారు. జైలు వద్దకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కోర్టు విడుదల పత్రాలు జైలు వెనుక దారి నుంచి వెళ్లి ఇవ్వాల్సి వచ్చింది.
3.45 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో, రక్షణగా కేటాయించిన భారీ కాన్వాయ్తో జైలు ముందు నుంచి ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. అందరికీ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. జగన్ అభిమానులు ఆయనపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. మహిళా నేతలు గుమ్మడికాయలతో దిష్టితీశారు.
నగరంలో ర్యాలీలపై నిషేధం ఉన్నప్పటికీ చంచల్గూడ జైలు నుంచి చాదర్ఘాట్, ఎంజే మార్కెట్, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, తాజ్ దక్కన్, జలగం వెంగళరావు పార్కు, కెబిఆర్ పార్కు, జూబ్లీ చెక్పోస్టు మీదుగా జగన్ ర్యాలీగా లోటస్పాండ్లోని తన ఇంటికి చేరుకున్నారు.
జగన్ మార్గమధ్యంలో సచివాలయం వద్ద తెలుగు తల్లి విగ్రహానికి, పంజాగుట్ట సర్కిల్లో వైయస్ విగ్రహానికి దండుల వేస్తారని తొలుత ప్రచారం జరిగినా ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో పోలీసులు కాన్వాయ్ని దారి మళ్లించారు. కాన్వాయ్కు ముందు కార్యకర్తలు మోటారు సైకిళ్ల ప్రదర్శన నిర్వహించారు.
ఇద్దరు ఎసిపిల పర్యవేక్షణలో 20మంది ఇన్స్పెక్టర్లు, పది మంది ఎస్ఐలను బందోబస్తుకు నియమించారు. జైలు పరిసర ప్రాంతాలతోపాటు వివిధ పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. జైలు మాత్రం మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు కార్యకర్తలు అత్యుత్సాహంతో ముందుకు కదిలారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేశ్ జెండా పట్టుకుని జైలుగేటు ఎక్కి జగన్ నినాదాలు చేశారు. మధ్యాహ్నం 3.45 గంటలకు మొదలైన ర్యాలీ సుమారు 6 గంటలపాటు కొనసాగింది. రాత్రి 9.45 గంటల సమయంలో జగన్ తన ఇంట్లోకి అడుగుపెట్టారు.












Click it and Unblock the Notifications