వివేకా కేసులో అవినాష్ పాత్ర తేల్చండి-లోక్ సభ స్పీకర్ కు కుమార్తె సునీతారెడ్డి లేఖ
మూడేళ్ల క్రితం సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే నిందితులు, సాక్ష్యులు సీబీఐకీ ఇస్తున్న వాంగ్మూలాలతో రోజుకో సంచలనం చోటు చేసుకుంటోంది. ఇదే క్రమంలో ఇప్పటికే సీబీఐకి గతేడాది వాంగ్మూలం ఇచ్చిన వివేకా కుమార్తె సునీతారెడ్డి.. ఇప్పటికీ ఈ కేసులో నిందితులు తేలకపోవడంతో లోక్ సభ స్పీకర్ ను ఆశ్రయించారు.
వివేకా హత్య కేసులో నిందితుడిగా సీబీఐ అనుమానిస్తున్న కడప ఎంపీ, తన సోదరుడు అవినాష్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వైఎస్ సునీతారెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని ఇందులో సునీతారెడ్డి ఆరోపించినట్లు సమాచారం. కాబట్టి అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని లోక్ సభ స్పీకర్ ను సునీత కోరారు. దీంతో పాటు సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలం కాపీని సైతం ఈ లేఖకు జత చేశారు. అలాగే సీబీఐకి ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా జత చేశారు.

వివేకా హత్య కేసులో జరుగుతున్న సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకోవడంతో ఇందులో హంతకులపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇదే క్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడు మనోహర్ రెడ్డిలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆ తర్వాత సీబీఐకి నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అలాగే సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు సైతం బయటికొస్తున్నాయి. వీటన్నింటిలోనూ అవినాష్ రెడ్డి పైరు ప్రధానంగా వినిపిస్తుండటం చర్చనీయాంశమవుతుండగా.. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ కు వివేకా కుమార్తె కూడా ఆయనపై ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది.












Click it and Unblock the Notifications