YSR Bima: తెలుసుకోవాల్సిన కీలక మార్పులు: కొత్త విధానంతో జనం ముందుకు: వైఎస్ జగన్
అమరావతి: వైఎస్సార్ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని మిగిల్చిన ప్రస్తుత పరిస్థితుల్లో.. మరింత మందిని ఈ బీమా కవరేజీ పరిధిలోకి తీసుకుని వచ్చేలా సవరణలను చేసింది జగన్ సర్కార్. మార్పులు చేసిన కొత్త బీమా పథకం జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ లోగా పాత విధానంలో దాఖలైన క్లెయిమ్లన్నింటినీ క్లియర్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించాలని నిర్ణయించింది.

అయిదురెట్ల పరిహరం..
వైఎస్సార్ బీమా పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ఈ బీమా పథకం ద్వారా నేరుగా ప్రభుత్వ సహాయం అందేలా చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబంలో సంపాదించే స్థాయిలో ఉన్న 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వ్యక్తి సహజంగా మరణిస్తే లక్ష రూపాయల సహాయాన్ని అందించాలని జగన్ ఆదేశించారు. కుటుంబంలో సంపాదించే 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే అయిదు రెట్ల పరిహారం అంటే.. అయిదు లక్షల రూపాయలను అందించాలని అన్నారు.

జులై 1 నుంచి కొత్త విధానం..
జూలై 1 నుంచి కొత్త మార్పులతో కూడిన వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. ఈలోగా క్లెయిమ్లన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బీమా పరిహారాలపై దరఖాస్తు అందిన నెల రోజుల్లో వాటిని పరిష్కరించాల్సి ఉంటుందని, పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. దీనికోసం ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని ఆయన ఆదేశించారు. రైతులు గానీ, మత్స్యకారులు గానీ, పాడిపశువులు గానీ ప్రమాదావశావత్తూ మరణిస్తే.. వాటికి సంబంధించిన బీమా పరిహారాలన్నీ దరఖాస్తు అందిన నెలరోజుల్లోగా చెల్లించాలని అన్నారు. నెలరోజుల్లోగా క్లెయిములను పరిష్కరించి బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు.

ప్రతి మూడునెలలకూ నివేదిక..
అన్నిరకాల బీమా క్లెయిములకు సంబంధించి కలెక్టర్లు ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని వైఎస్ జగన్ ఆదేశించారు. అందిన క్లెయిములు, పరిష్కారానికి నోచుకున్నవి, ఎంతమందికి పరిహారం చెల్లించామనే విషయంపై స్పష్టత, పారదర్శకత, పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. సంపాదించే వ్యక్తిని కోల్పోయిన ఆ కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వంపై ఉందని, దీన్ని విస్మరించొద్దని అన్నారు. పరిహారం చెల్లింపులోనూ జాప్యం ఉండకూడదని తేల్చి చెప్పారు వైఎస్ జగన్. బీమా దరఖాస్తుల స్క్రీనింగ్ బాధ్యతను, గ్రామ, వార్డు సచివాలయాలను అప్పగించాలని ఆదేశించారు.

ఆర్థిక శాఖ అధికారులకు ప్రశంస..
ఇళ్లపట్టాలు, సంపూర్ణ పోషణ, ఆరోగ్యశ్రీ, జగనన్న తోడు, వంటి పథకాల కింద 1.35 లక్షల కోట్ల రూపాయల నగదు మొత్తాన్ని ఒక్క బటన్ క్లిక్ చేయడం ద్వారా బదిలి చేయగలిగామని, ఈ విషయంలో ఆర్థికశాఖ అధికారుల శ్రమ ఉందని వైఎస్ జగన్ ప్రశంసించారు. డీబీటీ రూపంలో లబ్దిదారులకు మరో 95 వేల కోట్లు బదిలీ చేశామని బదిలీ చేయగలిగామని, అవినీతికి అవకాశం లేకుండాపోయిందని అన్నారు. ఇలాంటి అవినీతి రహిత ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటారని వైఎస్ జగన్ అన్నారు. కోవిడ్ వల్ల ఆశించిన ఆదాయం ప్రభుత్వానికి రాకపోయినప్పటికీ.. ఏ కార్యక్రమం కూడా ఆగకుండా అనుకున్న సమయానికే పూర్తి చేస్తోన్నామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటోన్నామని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications