ఆ బోర్డులూ కారణం!, తొక్కిసలాటకు చంద్రబాబే కారణం: హెచ్చార్సీకి వైసీపీ
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రమాద ఘటనకు పలు కారణాలు ఉన్నాయి. అధికారుల సమన్వయలోపం, భక్తులు ఒకే ఘాట్కు ఎక్కువ మంది రావడం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. మరోవైపు దాదాపు అన్ని బోర్డులు పుష్కర ఘాట్కే ఉన్నాయి. ఇది కూడా ప్రమాదానికి ఓ కారణంగా భావిస్తున్నారు.
రాజమండ్రిలో దాదాపు ప్రతిచోట, ఎక్కువ బోర్డులు ఇవే ఉన్నట్లుగా తెలుస్తోంది. పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలోనూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలూ మంగళవారం నాటి ప్రమాదానికి ఓ కారణమయ్యాయి. పుష్కరాల కోసం వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి వచ్చే యాత్రికులకు ఈ ప్రాంతం కొత్త.
దీంతో పుష్కరఘాట్కు దారి పేరుతో ఫ్లెక్సీల్లో సూచించిన దారినే భక్తులు అనుసరించారు. అసలే ఇరుకుగా ఉండే పుష్కరాల రేవుకు పరిమితికి మించి యాత్రికులు చేరుకున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి రాజమండ్రిలో 16 ఘాట్లను ఆధునీకరించినప్పటికీ ఆయా ఘాట్లను సూచించే బోర్డులు పెద్దగా లేవు.
యాత్రికుల భద్రతపై నిరంతర పర్యవేక్షణ, 200 సీసీ కెమెరాలు, అవన్నీ కంట్రోల్ రూమ్కు అనుసంధానం, అక్కడ పర్యవేక్షణకు ఒక డీఎస్పీ, రద్దీ నిర్వహణపై ఎప్పటికప్పుడు పోలీసులకు సూచనలు అందించడం ఇదీ రాజమండ్రిలో పుష్కర రద్దీ నిర్వహణపై పోలీసులు రూపొందించుకున్న వ్యూహం. కానీ, ఆచరణలో ఘోరంగా విఫలమయ్యారని అంటున్నారు.
తొక్కిసలాటకు చంద్రబాబు బాధ్యుడు: హెచ్చార్సీలో వైసీపీ ఫిర్యాదు
గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యమే కారణమని, ఆయన పైన 304(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశఇంచాలని వైసీపీ న్యాయవిభాగం బుధవారం హెచ్చార్సీని ఆశ్రయించింది.
కేసు విచారణకు స్వీకరించిన కమిషన్ సభ్యుడు కాకుమాను పెదపేరి రెడ్డి ఈ నెల 27లోపు సమగ్ర నివేదిక అందించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, రాజమండ్రి అర్బన్ ఎస్పీలకు నోటీసులు జారీ చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ మార్గదర్శకాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని వైసీపీ న్యాయవిభాగం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.