మాఫీపై స్పష్టత లేదు, నందిగామలో పోటీ చేద్దాం: జగన్
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు చెప్పారని అంటున్నారు. పార్టీ తరఫున ఈసారి అభ్యర్థిని బరిలోకి దింపాల్సిందేనని, ఇటీవల గొట్టిముక్కలలో పార్టీ కార్యకర్త కృష్ణారావు హత్యకు గురికావడంతో అక్కడకు వచ్చిన జగన్ నందిగామ నియోజకవర్గం పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు.
అయితే ఇక్కడ తంగిరాలకు గట్టి పట్టు ఉందని, ఇంకొకటి రుణ మాఫీ ప్రకటన దీంతో ఇక్కడ తమ పార్టీ గెలవడం కష్టమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జగన్కు సూచించారు. రుణ మాఫీపై సరైన ప్రకటన లేదని, అందుచేత పోటీ చేద్దామని జగన్ వ్యాఖ్యనించారు. ఈ నెల 20 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
కాగా, నందిగామ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నందిగామ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో అక్కడ రాజకీయ సందడి నెలకొంది. ఆదివారం సాయంత్రం దివంగత తమ పార్టీ దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు సమాధివద్ద తెలుగుదేశం విస్తృత సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. ఈసారి టీడీపీ తరఫున తంగిరాల పెద్ద కూతురు సౌమ్యను రంగంలోకి దించాలని పలువురునేతలు దేవినేని ఉమాకు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ చంద్రబాబు వద్దకు పంపాలని యోచిస్తున్నారు.