జగన్ దీక్షకు షాక్: హౌస్ మోషన్ను తోసిపుచ్చిన హైకోర్టు
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో జగన్ రేపు శనివారంనాడు తలపెట్టిన దీక్ష ఉండే అవకాశం లేదు. హైకోర్టు నిర్ణయాన్ని పాటిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుుడు అంబటి రాంబాబు ఇది వరకే చెప్పారు. దీంతో జగన్ తన దీక్షను రద్దు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు ఈ నెల 28వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల్లో హైకోర్టు నుంచి ఏదీ ఆశించవద్దని హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి స్పష్టం చేశారు. సాధారణ కోర్టుకు వెళ్లాలని న్యాయమూర్తి వైసిపి నేతలకు సూచించారు.
న్యాయమూర్తి పిటిషన్ను తిరస్కరించలేదని, ఈ నెల 28వ తేదీన విచారణ చేపడుతామని చెప్పారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి చెప్పారు. జగన్ దీక్షను వాయిదా వేస్తున్నట్లు, హైకోర్టు తీర్పు తర్వాతనే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెప్పారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను దీక్షకు అనుమతించాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హైకోర్టులో శుక్రవారంనాడు హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. జగన్ దీక్ష ఎట్టిపరిస్థితులలో జరుగుతుందని పార్టీశ్రేణులు చెబుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కుయక్తులు పన్నినా దీక్ష ఆగదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. జస్టిస్ శేషసాయి నివాసంలో దానిపై విచారణ సాగుతోంది.
జగన్ దీక్షపై తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. జగన్ దీక్షకు ఉద్దేశించిన గుంటూరులోని ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. గంటూరులోని ఏసీ కాలేజీ హాస్టల్ మైదానంలో దీక్షకు వైసీపీ అన్నీ ఏర్పాట్లు చేసింది. అయితే దీక్షకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
శనివారం ఉదయం జగన్ గుంటూరులో దీక్ష చేపట్టాల్సి ఉంది. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే రేపు దీక్ష విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏం చేస్తుందనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొని ఉది.
ఇదిలావుంటే, జగన్ నీచ రాజకీయాలు చేస్తూ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి రావెల కిశోర్బాబు మండిపడ్డారు. కేసీఆర్తో కుమ్మక్కై జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆయన విజయవాడలో ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు దీక్షల పేరుతో దొంగ జపాలు చేయడం మానాలని హితవు పలికారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్కు లేదని రావెల అన్నారు.