18 షరతులతో జగన్ సమైక్యాంధ్ర సభకు పర్మిషన్
హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన హైదరాబాదులో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలపెట్టిన సమైక్యాంధ్ర సభకు 18 షరతులతో అనుమతి లభించింది. రాష్ట్ర హైకోర్టు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ నెల 19వ తేదీన హైదరాబాదులో సమైక్యాంధ్ర సభను పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు నగర పోలీసులు కూడా దానికి అనుమతి ఇచ్చారు.
ఈ నెల 16వ తేదీన హైకోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అయితే సమయం సరిపోదనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర సభను వాయిదా వేసుకుంది. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని వైయస్సార్ కాంగ్రెసు ఈ నెల 26వ తేదీన తలపెట్టిన సభకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ నుంచి అనుమతి లభించింది.
షరతులను కచ్చితంగా పాటించాలని పోలీసులు వైయస్సార్ కాంగ్రెసును ఆదేశించారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఆ సభ జరగనుంది. సభను మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించి సాయంత్రం ఐదు గంటలకు పూర్తి చేయాలని పోలీసులు ఓ ప్రటనలో తెలిపారు.

సమైక్యాంధ్ర సభ సందర్భంగా ఏవైనా విధ్వంసం, అవాంఛనీయ సంఘటనలు జరిగితే నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పద్ధతి ప్రకారం సభను నిర్వహించుకోవాలని చెప్పారు.
రెచ్చగొట్టే ప్రకటనలు చేయబోమని, అవాంఛనీయ సంఘటనలకు ప్రేరేపించబోమని నిర్వాహకులు ముందస్తుగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సభకు వచ్చేవారిలో సంఘ వ్యతిరేక శక్తులు చేరే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. సభకు వచ్చేవారిని గుర్తించడానికి తగిన విధంగా వ్యవహరించాలని పోలీసులు నిర్వాహకులకు సూచించారు.












Click it and Unblock the Notifications