ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం: జగన్ వల్లనే?
హైదరాబాద్: రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 33 మంది రైతు కుటుంబాలకు మధ్యంతర పరిహారం కింద ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం రూ.49.50 లక్షలు విడుదల చేసింది. వైయస్సార్ కాగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర వల్లనే ప్రభుత్వం దిగి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెబుకుంటున్నాయి.
వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రపై రాష్ట్ర మంత్రులు గతంలో విమర్శలు చేస్తూ రైతులు ఆత్మహత్యలే చేసుకోలేదని అన్నారని, ప్రస్తుత ఉత్తర్వులతో అనంతపురం జిల్లాలో 33 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లయిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి వైయస్ జగన్ అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఓ వైపు జగన్ యాత్ర సాగుతుండగానే ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు సమస్యలపై అనంతపురం జిల్లాలో పర్యటించారు.
జగన్ భరోసా యాత్రపై అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మంగళవారంనాడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ టిఆర్ఎస్ గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మరో మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఆయనపై విరుచుకుపడ్డారు.