'వైఎస్సార్సీపీ ప్రాంతీయ పార్టీయే': రాజధాని తేల్చాలని..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ పార్టీ అని, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ చేయడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఇష్టం లేదన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ పార్టీ అయినందున ఒకే మేనిఫెస్టో ఇచ్చిందని, తమది జాతీయ పార్టీగా ఎదిగినందున ప్రాంతాలను, ప్రాధాన్యతలను బట్టి రెండు మేనిఫెస్టోలు విడుదల చేశామని వివరించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
రాజధానిపై తేల్చండి

హామీలకు బడ్జెట్ కేటాయింపులకు పొంతన ఉండాలని, రాజధాని ఎక్కడనేది తేల్చాలని, రుణమాఫీ త్వరగా చేయాలని శాసనమండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార, విపక్ష నేతలు సుదీర్ఘంగా మాట్లాడారు.
ఏపీ రాజధాని కోసం అటవీ భూములు లక్ష ఎకరాలు డీనోటిఫై చేసేందుకు, పరిపాలనా కార్యాలయాలకు భవన నిర్మాణాలకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు విభజన బిల్లులో కేంద్రం చెప్పిందని ఆ ప్రకారం అక్కడ్నించి నిధులు రాబట్టుకోవాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోరారు. అందరితో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. వెనకబడిన ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ మాదిరిగా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినా, బడ్జెట్లో కేటాయింపుల్లేవని, దానిపై పోరాడాలన్నారు.












Click it and Unblock the Notifications