బాబు రాజధాని గడియ 12.17,జగన్ ఎమ్మెల్యే మద్దతు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన గురువారం మధ్యాహ్నం 12.17 నిమిషాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభలో ప్రకటన చేయనున్నారు. విజయవాడ సమీపంలో రాజధాని నిర్మించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. శాసన సభ సమావేశాలు జరుగుతున్నందున ఈ విషయాన్ని సభలోనే చెప్పాల్సి ఉంది.
వాస్తవానికి మంగళవారం దీని పైన సభలో ప్రకటన చేయాలనుకున్నప్పటికీ.. ముహూర్తం బాగాలేదని కొందరు చెప్పడంతో ఆ యోచన విరమించుకున్నారు. గురువారం మంచి రోజు కావడంతో ఆ రోజున నిర్ణయించిన ముహూర్తానికే ఆయన ప్రకటన చేయనున్నారు. ప్రముఖ సిద్ధాంతకర్త శ్రీనివాస గార్గేయ ఈ విషయమై సీఎం కార్యాలయంతో మాట్లాడి ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. సభలో ఆ సమయానికి సీఎం మాట్లాడేలా చూడనున్నారని తెలుస్తోంది.

చంద్రబాబుకు జగన్ పార్టీ ఎమ్మెల్యే మద్దతు!
రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. విజయవాడకు చెందిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో రాజధానిని స్వాగతించారు. విజయవాడ ప్రాంతంలో రాజధాని మంచి నిర్ణయమని, దీనికి తాను మద్దతు పలుకుతున్నానని చెప్పారు. విజయవాడ రాజధానికి అన్ని విధాలా అర్హమైనదన్నారు.
రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయడం సరేందే అని ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, నూజివీడు, మైలవరంలో 25వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయన్నారు. కమిటీ పూర్తిస్థాయిలో పర్యటించకుండానే నివేదిక ఇచ్చిందన్నారు. రాజధాని నిర్మాణానికి ఎనిమిదేళ్లు పడుతుందన్నారు.












Click it and Unblock the Notifications