బాబు రాజధాని గడియ 12.17,జగన్ ఎమ్మెల్యే మద్దతు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన గురువారం మధ్యాహ్నం 12.17 నిమిషాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభలో ప్రకటన చేయనున్నారు. విజయవాడ సమీపంలో రాజధాని నిర్మించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. శాసన సభ సమావేశాలు జరుగుతున్నందున ఈ విషయాన్ని సభలోనే చెప్పాల్సి ఉంది.
వాస్తవానికి మంగళవారం దీని పైన సభలో ప్రకటన చేయాలనుకున్నప్పటికీ.. ముహూర్తం బాగాలేదని కొందరు చెప్పడంతో ఆ యోచన విరమించుకున్నారు. గురువారం మంచి రోజు కావడంతో ఆ రోజున నిర్ణయించిన ముహూర్తానికే ఆయన ప్రకటన చేయనున్నారు. ప్రముఖ సిద్ధాంతకర్త శ్రీనివాస గార్గేయ ఈ విషయమై సీఎం కార్యాలయంతో మాట్లాడి ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. సభలో ఆ సమయానికి సీఎం మాట్లాడేలా చూడనున్నారని తెలుస్తోంది.
చంద్రబాబుకు జగన్ పార్టీ ఎమ్మెల్యే మద్దతు!
రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. విజయవాడకు చెందిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో రాజధానిని స్వాగతించారు. విజయవాడ ప్రాంతంలో రాజధాని మంచి నిర్ణయమని, దీనికి తాను మద్దతు పలుకుతున్నానని చెప్పారు. విజయవాడ రాజధానికి అన్ని విధాలా అర్హమైనదన్నారు.
రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయడం సరేందే అని ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, నూజివీడు, మైలవరంలో 25వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయన్నారు. కమిటీ పూర్తిస్థాయిలో పర్యటించకుండానే నివేదిక ఇచ్చిందన్నారు. రాజధాని నిర్మాణానికి ఎనిమిదేళ్లు పడుతుందన్నారు.