BRSను ఏపీకి ఆహ్వానిస్తున్న YSRCP?
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. జాతీయపార్టీగా రూపాంతరం చెందిన తర్వాత నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధించడం తప్పనిసరి. లేదంటే పార్టీ గుర్తు కారు కూడా వెళ్లిపోతుంది. అందుకే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు తెలంగాణకు కవల రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై దృష్టిసారించారు.

ఇక్కడి ప్రజలకు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు?
ఉమ్మడి రాష్ట్ర విభజనను ఏపీలోని ప్రజలంతా వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులను కేసీఆర్ తోపాటు కేటీఆర్, హరీష్ రావు, ఆచార్య కోదండరాం తదితర నేతలంతా అసభ్య పదజాలంతో దూషించారు. వీటిని సీమాంధ్రులు ఇంకా మరిచిపోలేదు. ఆ విషయం కేసీఆర్ కు కూడా తెలుసు. బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఏపీలో ఏవిధంగా ప్రచారం చేస్తారని, ఏవిధంగా ఇక్కడి ప్రజలను సమాధానపరుస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి వీటికి కేసీఆర్ దగ్గర కూడా సమాధానం లేదు. రాజకీయ వ్యూహాల్లో గండర గండడుగా పేరు తెచ్చుకున్న ఆయనకు ఇదేమంత పెద్ద విషయంగా అనిపించడంలేదు.

బీఆర్ఎస్ తో చీలనున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు?
భారత రాష్ట్ర సమితి ఏపీకి రావడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా రాయలసీమకు చెందిన నేతలు బీఆర్ఎస్ రావడంవల్ల మంచే జరుగుతుందంటున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ రేపటి ఎన్నికల్లో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎదురవుతుంది. దీనివల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. మరోవైపు పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంవల్లే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందని, అలా కాకుండా రేపటి ఎన్నికల్లో ఓటు చీలిపోనివ్వకుండా అవసరమైతే పొత్తులకు కూడా సిద్ధమని ప్రకటించారు.

టీడీపీ-జనసేన మధ్య పొత్తు?
పవన్ ప్రకటనను బట్టి తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వైసీపీని బాగా ఇబ్బందిపెట్టే విషయంగా మారింది. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఏపీలోకి రావడంవల్ల తమకే మంచి జరుగుతుందని, వ్యతిరేక ఓటు చీలి తమకు ఊపిరిపీల్చుకునే వెసులుబాటు కలుగుతుందంటున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును సమీకృతం చేస్తానని పవన్ స్పష్టం చేస్తున్నారు. అయితే వైసీపీ అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ ఏపీ ఎన్నికల్లో పోటీచేసి ఏవిధంగా ఓట్లను చీలుస్తుందో స్పష్టత రావాలంటే ఎన్నికలయ్యేంతవరకు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications