టీలో లాగే ఏపీలో, చంద్రబాబు అవినీతిపై సిబిఐ విచారణ: జైట్లీకి జగన్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏపీ సర్కారు ఖూనీ చేస్తోందని.. న్యూఢిల్లీలో వైయస్ జగన్ బృందం చేపడుతున్న 'సేవ్ డెమొక్రసీ' కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి జైట్లీని బుధవారం మధ్యాహ్నం వైయస్ జగన్ కలిశారు.
ఈ సందర్భంగా 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పేరిట టిడిపి అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రచురించిన పుస్తకాన్ని వైయస్ జగన్ స్వయంగా అరుణ్ జైట్లీకి అందించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని, బాబు అవినీతిని జైట్లీకి వివరించారు.
రాష్ట్రంలో సాగుతున్న పాలన తీరుపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చూడాలన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు.
ఏపీకి రైల్వే జోన్ కేటాయించాలని, పోలవరం ప్రాజెక్ట్ ను వెంటనే పూర్తి చేయాలని కూడా అరుణ్ జైట్లీని జగన్ బృందం కోరింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందున.. కేంద్రమే ముందడుగు వేయాలని ఆయన కోరారు. కాగా, మంగళవారం హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన విషయం తెలిసిందే.
టీలో లాగే ఏపీలో చంద్రబాబు
అనంతరం ఢిల్లీలో మీడియాతో జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత రెండేళ్లలో 31 స్కాంలకు పాల్పడ్డారని, మొత్తం లక్షా 34 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వం అవినీతి సొమ్ముతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న వైనాన్ని వివరించారు. పార్టీ మారితే మంత్రి పదవి ఇస్తామని విపక్ష ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెడుతున్నారని అన్నారు. స్పీకర్ ను అడ్డంపెట్టుకుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు అవినీతిపై 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పేరుతో పుస్తకం ముద్రించామని, జీవోలతో సహా మొత్తం వివరాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచామని తెలిపారు. రాజధాని పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో రాజధాని వస్తుందని చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
తన అనుచరులు, బినామీలతో రాజధాని ప్రాంతంలో భూములను కొనిపించారని, ఆ తర్వాత ఆ ప్రాంతంలో రాజధానిని ప్రకటించారని చెప్పారు. ఒక్క రాజధాని వ్యవహారంలోనే లక్ష కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఆరోపించారు.
రైతుల భూములున్న ప్రాంతాన్ని అగ్రికల్చర్ జోన్ గా ప్రకటించి.. చంద్రబాబు బినామీల భూములను అర్బన్ ఏరియా కిందకు తీసుకొచ్చారని విమర్శించారు. సీబీఐ విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగుచూస్తాయన్నారు.
చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని, ఏపీలోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయాలని చెప్పారు. అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించి.. ఎలక్షన్ కమిషన్ కు ఆ బాధ్యత అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.