నేను మాట్లాడితే మైక్ కట్, బాబు సిఎం అయిన్నప్పుడల్లా రైతులకు కష్టాలే: జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయినప్పుడల్లా రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని జగన్ తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న ప్రతీ రైతు ఇంటికీ వెళ్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. గురువారం కరువు పరిస్థితులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ.. 50 శాతం మంది రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు వరి పంట వేశారని ఆయన తెలిపారు.
చంద్రబాబు తీరు వల్లే రైతులు పంటలు వేయలేకపోయారని విమర్శించారు. కరవుపై మాట్లాడుతుంటే నా మైక్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏడాదికి రూ.5వేల కోట్లు ఖర్చు పెడితే మూడేళ్లలో పోలవరం పూర్తవుతుందన్నారు.
కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులు తీసుకుని రైతులకు ఇవ్వలేదన్నారు. ఏపీలో 197 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.
రైతుల తలరాతలు మార్చగలిగితే మార్చండని ఆయన అన్నారు. రైతుల కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదని వివరించారు. రైతు కుటుంబాలకు పరిహారం మొత్తం ఒక్కసారి చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు పోలవరం, పులిచింతల పూర్తి చేయాలని లేదన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమకు, రాష్ట్రానికి మేలని అన్నారు. అనంతపురంలో తాను యాత్రలు చేశాను కాబట్టే రైతులకు పరిహారం ఇచ్చారన్నారు.
విద్యుత్ కోసం శ్రీశైలం నీటిని ఎడాపెడా వాడేస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్షకు దిగుతానన్న రోజు వినాయక చవితి కావడం వల్ల.. వాయిదా వేసుకునే అవకాశముందన్నారు.