ఇల్లు, ఆఫీస్ ఒకేచోట: లోటస్పాండ్లా అమరావతిలోను వైసిపి ఆఫీస్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో సిద్ధమైంది. దసరా నేపథ్యంలో ఆలోపే కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం సిద్ధం చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో సిద్ధమైంది. దసరా నేపథ్యంలో ఆలోపే కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం సిద్ధం చేశారు.

జగన్కు టైం ఉంటుందా లేదా?
ఈ నెల 22 లేదా 27వ తేదీల్లో ఏదో ఒకరోజున కార్యాలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకుని ఈ నెల 21న హైదరాబాద్ తిరిగి వస్తారు. మరుసటి రోజే పార్టీ కార్యాలయ ప్రారంభానికి సమయం సరిపోతుందా లేదా అని పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది.

హైదరాబాద్ లోటస్ పాండులో ఒకే దగ్గర
ఆ రోజు కుదరకపోతే 27వ తేదీన చేస్తారు. మరోవైపు అక్టోబరు 27నుంచి జగన్ చేపట్టనున్న పాదయాత్రకు జిల్లాల వారీగా అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఆ లోపు తాడేపల్లిలో శాశ్వత ప్రాతిపదికన పార్టీ కార్యాలయంతోపాటు, జగన్ నివాసం (లోటస్పాండ్ తరహాలో ఇల్లు, కార్యాలయం ఒకేచోట) నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

నిర్మాణాలపై కోర్టుకు ఆళ్ల
కృష్ణానదీ తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను సవాలు చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో ఇదే అంశంపై తాను హైకోర్టును ఆశ్రయించగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించిందని, మరోసారి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.

ప్రతివాదుల జాబితాలో 49 మంది
ఉండవల్లి, పెనుమాక, తదితర గ్రామాల కృష్ణానది రివర్ బెడ్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు చేశానని ఆళ్ల చెప్పారు. 49 మందిని ఈ వ్యాజ్యంలో ప్రతివాదుల జాబితాలో చేర్చారు. 32 మంది అతిథిగృహ యజమానులు ఉన్నారు. వారిలో లింగమనేని రమేశ్ తదితరులున్నారు.












Click it and Unblock the Notifications