ఏమైందని బాబు, బీజేపీకి జగన్ పార్టీ ప్రశ్న, గెలిపించిన బాలకృష్ణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను కల్పించే విషయమై కేంద్రంపై వత్తిడి తీసుకురావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డిలు విమర్శించారు.
ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారని, అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పిన ఎన్డీయే నాయకులు ఇప్పుడు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించి ఏడు నెలలు గడచినా ఏపికి ఒరిగిందేమీ లేదన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తామని కేంద్రం ఇచ్చిన హామీ అమలు కోసం ఆ ప్రాంతాల ప్రజలు ఏడు నెలల నుంచి ఎదురుచూస్తున్నారని, రాయలసీమను చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. మన్నవరం ఎన్టీపిసి ప్రాజెక్టు వద్ద కేవలం గోడ కట్టారని, చిత్తూరు జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీని మూసివేస్తామంటూ రైతులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందన్నారు.

ప్యాకేజీల సంగతి పక్కనపెట్టి ఉన్న పరిశ్రమలను మూసివేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో దాదాపు 54 సంస్ధలు మూతపడ్డాయని, గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తామన్న హామీని గాలికి వదిలేశారన్నారు. విశాఖ-చెన్నై పరిశ్రమల కారిడార్ సంగతి ఏమైందన్నారు.
తిరుపతి, విశాఖపట్నం, గన్నవరంలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతామన్న హామీలను పట్టించుకునేవారే లేరని, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో బలంగా వాదన వినిపించిన కేంద్రమంత్రి వెంకయ్య ఇప్పుడు ఎన్డీయే హామీల అమలు జోలికి వెళ్లడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారని, కాని కేంద్రం ఇంతవరకు ఒక్క పైసా కూడా ఈ ప్రాజెక్టుకు ఖర్చుపెట్టలేదన్నారు.
బ్యాట్ పట్టిన బాలయ్య
హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ శనివారం క్రికెట్ ఆడి సందడి చేశారు. స్థానిక ఎంజిఎం క్రీడా మైదానంలో పోలీసు, హెచ్సిఎ సీనియర్ల జట్ల నడుమ ఫైనల్ మ్యాచ్ను బాలయ్య ప్రారంభించారు. అనంతరం లెజెండ్, ప్రెస్ లెవెల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బాలకృష్ణ మూడు ఓవర్లు స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్లోనూ రాణించి జట్టును గెలిపించారు. బాలయ్యను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.












Click it and Unblock the Notifications