తిరుపతి మలుపు: టిడిపి సుగుణమ్మకు జగన్ పార్టీ మద్దతు
తిరుపతి: తిరుపతి శాసనసభ ఉప ఎన్నిక మలుపు తిరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మకు మద్దతు ఇవ్వడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందుకు వచ్చింది. తాము సుగుణమ్మకు మద్దతు ఇస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగర శాఖ శనివారంనాడు ప్రకటించింది. తిరుపతి శాసనసభా నియోజకవర్గానికి దివంగత శాసనసభ్యుడు డాక్టర్ వెంకటరమణ భార్య సుగుణమ్మను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోటీ దించారు.
చిత్తూరు జిల్లా తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటరమణ మృతి నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తిరుపతి శాసన సభ నియోజకవర్గానికి ఫిబ్రవరి 13న ఎన్నికల నిర్వహించనున్నారు. 16న ఓట్లు లెక్కించాలని ప్రటించించింది. వెంకటరమణ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో వెంకటరమణ సతీమణి సుగుణా వెంకటరమణకు టీడీపీ టిక్కెట్టు ఇచ్చి ఇతర పార్టీల సహకారంతో ఆమె ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న ఆలోచనలతో చంద్రబాబు ప్రయత్నించారు.
చంద్రబాబు ప్రయత్నం ఫలించలేదు. అయితే, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు నెరిపిన వెంకటరమణ కుటుంబానికి అవసరమైనప్పుడు సహకరిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ప్రకటించిందని భావించవచ్చు.
సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు, ఉపఎన్నికలో వారి కుటుంబ సభ్యులు బరిలోకి దిగితే పోటీకి దిగరాదనే సంప్రదాయాన్ని దాదాపు అన్ని పార్టీలు పాటిస్తున్నాయి. అయితే, కృష్ణా జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించింది. కానీ, ఆళ్లగడ్డ ఉపఎన్నికలో మాత్రం అభ్యర్థిని నిలబెట్టలేదు. అయితే, తిరుపతి ఉపఎన్నికలో మాత్రం బరిలోకి దిగింది.