కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం .. టీడీపీ పనే అంటూ వైసీపీ ఆందోళన, ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు గందరగోళంగా తయారయ్యాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య బాహాబాహీలు, దాడులు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో స్థానికంగా కలకలం రేగింది.

కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలంలో ఓ ఎన్ కొత్తూరు గ్రామ శివారులో ఉన్న దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ నుండి విగ్రహం కనిపించకుండా మాయం చేశారు. ఈరోజు ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు చూసే సరికి విగ్రహం కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం చేయడం, ఆపై మాయం కావడం తెలుగుదేశం పార్టీ నేతల పనే అని వైసిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ పనే అని వైసీపీ కార్యకర్తల ఆందోళన
విగ్రహాన్ని తొలగించిన వ్యక్తులను పట్టుకోవాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామంలో ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గ్రామం కుప్పం నియోజకవర్గంలో ఉండడంతో ఇది తెలుగుదేశం పార్టీ నేతల పనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా తగిన చర్యలు చేపట్టారు.

ఎన్నికల్లో ఓటమితో టీడీపీ దౌర్జన్యం చేస్తుందని వైసీపీ ఆరోపణ
చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో టిడిపి నాయకులు దౌర్జన్యకాండ చేశారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేకపోయామన్న అక్కసుతో టిడిపి కార్యకర్తలు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారు ఎక్కడికి తీసుకువెళ్లారు అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
ఓటమి బాధలో తెలుగు తమ్ముళ్ళు .. ఇదే సమయంలో వైఎస్ విగ్రహ ధ్వంసం
ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింది. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె లోనూ టి.డి.పి ఓటమి పాలైంది. ఇక కుప్పంలోనూ టీడీపీ ఘోరంగా దెబ్బతింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓటమిని చవిచూసింది. కుప్పంలో తెలుగుదేశం పార్టీ కేవలం మూడు ఎం పి టి సి స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం లోనే ఓటమి పాలు కావడంతో అటు చంద్రబాబు తో పాటుగా టీడీపీ శ్రేణులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇదే సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం కావడం టీడీపీ చేసిన పనేనని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రంలో ఎంపీపీ, స్కూల్ చైర్మన్ ఎన్నికలతో ఘర్షణలు, దాడులు, ఆందోళనలు
ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఎంపీపీ ఎన్నికలు, స్కూల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఘర్షణలు, కొట్లాటలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటన కూడా చోటుచేసుకోవడం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు, వివిధ జిల్లాల్లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ దాడి ఘటన జరిగినా వైసీపీ నాయకులు టీడీపీ నేతల మీద, టీడీపీ నాయకులు వైసీపీ నేతల మీద ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications