జగన్ పార్టీ అభ్యర్థి భార్య ఓటు గల్లంతు, సునీత విజ్ఞప్తి
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనంతపురం జిల్లా అభ్యర్థి గుర్నాథ్ రెడ్డి సతీమణి ఓటు గల్లంతయింది. బుధవారం ఉదయం గుర్నాథ్ రెడ్డి భార్య కెఎస్ఆర్ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయడానికి వెళ్లారు. ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేదు. దీంతో గుర్నాథ్ రెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కాసేపు నిలిచిపోయింది.
గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట మండలం రంగారెడ్డిపాలెంలో వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి వరగీయల మధ్య గొడవ జరిగింది. రామిరెడ్డిపాలెంలో పోలింగ్ బూత్ల్లో ఉన్న టిడిపి ఏజెంట్లతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. టిడిపి ఏజెంట్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. కిడ్నాప్ను అడ్డుకునేందుకు సిఆర్పీఎఫ్ బలగాలు గాల్లో కాల్పులు జరిపారు. కిడ్నాప్కు గురైన ఏజెంట్లను రక్షించడంతో పాటు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారింది. బాలికోన్నత పాఠశాలలో ఓ పార్టీ ప్రచారం నిర్వహించగా.. మరో పార్టీ అడ్డుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
భద్రత పెంచండి: పరిటాల సునీత
ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి భద్రత పెంచాలని రాప్తాడు టిడిపి అభ్యర్థి పరిటాల సునీత అధికారులకు విజ్ఞప్తి చేశారు. జమ్మలమడుగులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరాచకానికి పాల్పడుతోందని జమ్మలమడుగు టిడిపి అభ్యర్థి రామసుబ్బా రెడ్డి ఆరోపించారు. జగన్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు.