జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగలడం వెనుక?
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సత్యసాయి పుట్టపర్తి జిల్లా రామగిరి పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం ప్రస్ఫూటంగా కనిపించిందని ఆ పార్టీ శాసన మండలి సభ్యుడు, కేంద్ర కార్యాలయం ఇన్చార్జీ లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో హెలికాఫ్టర్ విండ్షీల్డ్ ధ్వంసంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముందుస్తు సమాచారంతోనే వైఎస్ జగన్ పర్యటించినా పోలీసులు కనీస బందోబస్తును కూడా ఏర్పాటు చేయకపోవడం వెనుక కుట్ర ఉందా అనే సందేహం కలుగుతోందని అన్నారు.

జగన్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందని లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. హెలికాఫ్టర్లో జగన్ ఆ ప్రాంతానికి వెళ్లగా.. హెలిప్యాడ్లో ఉన్న హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ పగిలి పోయిందంటే పోలీసులు ఏ మేరకు భద్రత కల్పించారో అర్థం చేసుకోవచ్చని ఆరోపించారు.
రెండు రోజుల ముందే ఈ పర్యటన ఉంటుందని అన్ని ప్రభుత్వ విభాగాలకు సమాచారం ఇచ్చి, అనుమతులు తీసుకున్న తరువాతే జగన్ హెలికాఫ్టర్లో అక్కడికి వెళ్లారని అప్పిరెడ్డి వివరించారు. హెలిప్యాడ్కు భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన అన్నారు.
ఒక మాజీ ముఖ్యమంత్రిగా, దేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడుగా వైఎస్ జగన్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారంటే ఏ మేరకు భద్రత కల్పించాలనే విషయంపై పోలీస్ యంత్రాంగానికి ఒక అంచనా అంటూ ఏమీ లేదా? అని అప్పిరెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలోని నాయకుడికి కల్పించే భద్రత ఇదేనా? అని నిలదీశారు.

ఒక మాజీ ముఖ్యమంత్రికే రక్షణ కల్పించలేకపోతే రాష్ట్రంలో సామాన్యులకు ఏం రక్షణ కల్పించగలరు? అని అప్పిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ వ్యక్తిగత భద్రత, నివాసం వద్ద సెక్యూరిటీని తగ్గించారని ఆరోపించారు. ఆయన పర్యటనల సందర్బంగా పోలీసులు ఎక్కడా భద్రతా చర్యలను చేపట్టట్లేదని విమర్శించారు.
కూటమి అధికారంలో ఉందని, చట్టాలకు విరుద్దంగా వారు చెప్పినట్లే పనిచేస్తే, వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత చట్ట విరుద్దంగా రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసిన అధికారులు చట్టం ముందు దోషులుగా నిలబడే పరిస్థితి వస్తుందని లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు.
గుంటూరు మిర్చియార్డ్ సందర్శనకు వెళ్లినప్పుడు కూడా ఒక్క పోలీస్ అధికారి కూడా భద్రతా ఏర్పాట్లలో కనిపించలేదని అప్పిరెడ్డి అన్నారు. చివరికి వైసీపీ శ్రేణులే జగన్కు భద్రత కల్పిస్తూ రోప్ పట్టుకుని ముందుకు నడిచాయని గుర్తు చేశారు. జగన్ భద్రత విషయంలో కేంద్రమంత్రులను కలిసి గతంలో వినతిపత్రాలు సమర్పించామని, అయినా ఫలితం లేదని అన్నారు.
విండ్షీల్డ్ డ్యామేజీ పైనా అనుమానాలు కలుగుతున్నాయని, కొందరు దుండగులు, అసాంఘికశక్తులు ఒక పథకం ప్రకారం జగన్ అభిమానుల ముసుగులో ఆయన పర్యటనలో పాల్గొని దాడులకు పాల్పడుతున్నారని లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. గతంలో కూడా ఇదే తరహాలో రెండు సార్లు జగన్పై దాడి జరిగిందని అన్నారు.












Click it and Unblock the Notifications