అప్పుడు మీరూ అడిగారు, కచ్చితంగా ఇవ్వాలి: వైసిపి ఎంపీ బుట్టా రేణుక నిలదీత
లోకసభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం నాడు ప్రస్తావించింది.జీరో అవర్లో ఆ పార్టీ సభ్యులు సుబ్బారెడ్డి, బుట్టా రేణుక మాట్లాడారు.
న్యూఢిల్లీ: లోకసభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం నాడు ప్రస్తావించింది.జీరో అవర్లో ఆ పార్టీ సభ్యులు సుబ్బారెడ్డి, బుట్టా రేణుక మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి మేలు కలుగుతుందన్నారు. కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. విభజన సమయంలో ప్రత్యేక ప్యాకేజీ పదేళ్లు కావాలని బీజేపీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చాక ఆ హామీని పక్కన పెట్టిందని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన జరిగి మూడేళ్లు కావొస్తున్నా హామీ అమలు చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని, హోదా ఇస్తే చాలునని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని బుట్టా రేణుక డిమాండ్ చేశారు.