ఏ వీధి ఎక్కడుందో కూడా తెలియదు.. మీరా గెలిచేది?: టీడీపీకి శిల్పా కౌంటర్
ఇప్పుడేమో ఎన్నికలు రాగానే అది చేస్తాం.. ఇది చేస్తామంటున్నారని.. ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదని శిల్పా మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల: నంద్యాల ఉపఎన్నిక కోసం టీడీపీ, వైసీపీలు చెమటోడుస్తున్నాయి. నంద్యాల జనం భూమా కుటుంబం వెంట ఉన్నారా? లేక వైసీపీనే విశ్వసిస్తున్నారా? అన్నది ఈ ఎన్నికతో తేలిపోనుంది. వైసీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన భూమా కుటుంబానికి, టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన శిల్పామోహన్ రెడ్డికి ఇది శల్య పరీక్ష లాంటిదే.
అలాగే.. ఈ ఎన్నికలో సత్తా చాటడం ద్వారా భవిష్యత్తు తమదే అని చాటుకోవాలని టీడీపీ, వైసీపీలు కుతూహలంతో ఉన్నాయి. మొత్తం మీద నంద్యాల ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయంతో.. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ఇరు పార్టీలు జాగ్రత్తపడుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం కూడా నడుస్తోంది. తాజాగా శనివారం నంద్యాలలో ప్రచార పర్వాన్ని ప్రారంభించిన వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి.. టీడీపీ మీద విరుచుకుపడ్డారు.
'టీడీపీ నేతలకు ఏ వీధి ఎక్కడుందో తెలియదు.. ఎన్నికలు రాగానే వాళ్లకు నంద్యాల గుర్తొచ్చింది. సమస్యలపై ఎన్నిసార్లు చంద్రబాబును కోరినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఎన్నికలు రాగానే అది చేస్తాం.. ఇది చేస్తామంటున్నారు.. ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదు' అంటూ శిల్పా మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, ఆ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తమదేనని శిల్పా స్పష్టం చేశారు. మరోవైపు నంద్యాల ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అగస్టు 23న ఉపఎన్నిక జరగనుండగా.. 28న కౌంటింగ్ జరగనుంది. శనివారం నుంచి అగస్టు 5వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అగస్టు 9 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు.