హెరిటేజ్ కు లాభాలు తగ్గుతాయనే రైతులను నట్టేట ముంచారు, బాబు గురించి మోడీకి చెప్పేశా: జగన్
హేరిటేజ్ కు లాభాలు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు మద్దతు ధర కల్పించడం లేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు.
విజయవాడ:హేరిటేజ్ కు లాభాలు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు మద్దతు ధర కల్పించడం లేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు.రైతాంగం సమస్యలపై మంగళవారం నాడు జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకొంటామని ఆయన ప్రకటించారు.
2014 ఎన్నికల ముందు 5 వేలకోట్లతో ధరల స్థీరీకరణ కోసం నిధిని ఏర్పాటు చేస్తామని బాబు ప్రకటించారని చెప్పారు.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిధి గురించి మాత్రం ప్రస్తావించడం లేదని ఆయన చెప్పారు.
రైతులకు అండగా ఉంటామని చెప్పారు.కానీ అధికారులను ప్రలోభపెట్టి వారితో తప్పులు చేయించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించారని జగన్ ఆరోపించారు.అధికారులు తప్పులు చేసినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై మంగళవారం నాడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.జీఎస్టీ బిల్లుకు తమ మద్దతు ఉంటుందన్నారు.
ప్రభుత్వ అధికారులు తప్పులు చేస్తున్న విషయాన్ని ఫిబ్రవరి 13న, లేఖ రాసినట్టు చెప్పారు.ప్రధానమంత్రి నుండి తనకు లేఖ వచ్చిందని చెప్పారు. కానీ, తాను ఈ నెల 10వ, తేదిన ప్రధానమంత్రిని కలిసిన విషయాన్ని గుర్తు చేశారు.
కాంగ్రెస్ తో కుమ్మక్కై తనపై కేసును వేశారని చెప్పారు. ప్రస్తుతం బిజెపిలో తనతో సన్నిహితంగా ఉన్న మంత్రులతో ఒత్తిడి తెస్తున్నారని జగన్ విమర్శించారు.ప్రధానమంత్రిని కలవడంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదా అంశంపై 15 నిమిషాలకు పైగా మాట్లాడాను.తాను మోడీని కలిసిన తర్వాత మోడీ అంటరానివాడుగా మారాడా అని ఆయన ప్రశ్నించాడు.
రాజకీయాల గురించి కూడ ప్రధానమంత్రితో చర్చించాను. రాష్ట్రంలో చోటుచేసుకొన్న అవినీతిపై కూడ ప్రధానమంత్రికి చెప్పాను. తన పదవిని దుర్వినియోగం చేసిన విషయాన్ని ప్రధానితో చెప్పాను.ప్రత్యేక హోదా గురించి ఏనాడైనా చర్చించారా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ విషయంలో మంత్రులకు ఎలాంటి సంబంధాలున్నాయో వివరించాను. మిర్చి రైతుల సమస్యలను దృష్టికి తీసుకెళ్ళాను.