ఏడు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ : టీడీపీ కంచుకోటలపై జగన్ జెండా : కుప్పం టు టెక్కలి ఇలా..!!
2019 సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలైన వైసీపీ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల్లో సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పంచాయితీ ఎన్నికల్లో 80 శాతం దక్కించుకున్న వైసీపీ..మున్సిపల్ ఎన్నికల్లో 98.6 శాతం విజయం తన ఖాతాలోనే వేసుకుంది. ఏపీలోని అన్ని కార్పోరేషన్లు...తాడిపత్రి మినహా అన్ని మున్సిపాల్టీల పైనా వైసీపీ జెండా ఎగుర వేసింది. ఇక, ఇప్పుడు తిరుగులేని ఆధిక్యంతో 13 జిల్లా పరిషత్లు, 99.95% మండల పరిషత్లలో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించింది.
టీడీపీ కంచుకోటలపై వైసీపీ జెండా
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం... సొంత ఊరు నారావారి పల్లెలోనూ పరాజయం తప్పలేదు. ఆయన భార్య దత్తత తీసుకున్న నిమ్మకూరులోనూ పరాభవమే. ఏడు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే..టీడీపీ ఏడు జెడ్పీటీసీలకు పరిమితం అయింది. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్లను కైవసం చేసుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 99.95 శాతం మండల పరిషత్లను చేజిక్కించుకోవడం ద్వారా రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 660 జడ్పీటీసీ స్థానాలకుగానూ 126 జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
మొన్న నగరాల్లో..ఇప్పుడు గ్రామాల్లో
మరో 19 స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. 515 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 10,047 ఎంపీటీసీ స్థానాలకుగానూ 2,233 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 95 స్థానాల్లో టీడీపీ, 43 స్థానాల్లో ఇతరులు వెరసి 2,371 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివిధ కారణాల వల్ల 457 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 7,219 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రకటించిన ఫలితాలు, ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ స్థానాలతో కలిపి చూస్తే.. 13 జిల్లా పరిషత్తుల్లోనూ వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం సాధించి.. క్లీన్ స్వీప్ చేసింది.
ఏడు జిల్లాల్లో అడ్రస్ లేని టీడీపీ
13 జిల్లా పరిషత్ అధ్యక్షులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఎన్నిక కావడానికి మార్గం సుగమమైంది. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను చూస్తే.. కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. కృష్ణాజిల్లాలో 2, మిగతా ఐదు జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీ స్థానానికే టీడీపీ పరిమితమైంది. మండల పరిషత్లోనూ వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. 99.95 శాతం మండల పరిషత్లలో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.
విజయాల్లో వైసీపీ కొత్త రికార్డు
ఆ మండల పరిషత్ ప్రెసిడెంట్లుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎన్నిక కావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పేర్కొనే మండలాలనే కర్ణాటక, పశ్చిమబెంగాల్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బ్లాక్లుగా పేర్కొంటారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఒకే పార్టీ 99.95 శాతం మండల పరిషత్ లేదా బ్లాక్లను చేజిక్కించుకున్న దాఖలాలు లేవు. ఏపీలో 2019లో జరిగిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీ.. 86.28 శాతం శాసనసభ స్థానాలు(151), 88 శాతం లోక్సభ స్థానాలను కైవసం చేసుకుని విజయభేరి మోగించింది.
కుప్పం టు టెక్కలి వయా మాజీ మంత్రుల నియోజకవర్గాలు
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ నాలుగు జెడ్పీటీసీలను గెలుచుకుంది. అదే విధంగా.. టిడిపి ఏపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు నియోజకవర్గం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 జెడ్పిటిసిల్లోనూ వైయస్సార్ సిపి ఘనవిజయం సాధించింది. టెక్కలి జెడ్పిటిసి వైయస్సార్ సిపి అభ్యర్థి 22,252 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హిందూపూర్...దేవిని ఉమా సొంత మండలం...ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ విజయం సాధించింది.
సీఎం జగన్ రెట్టించిన ఉత్సాహంతో..
మున్సిపల్ ఎన్నికల ద్వారా పట్టణ ఓటరు..పంచాయితీ-పరిషత్ ఎన్నికల ద్వారా పల్లె ఓటర్లు మొత్తం వైసీపీకి పట్టం కట్టటంతో తమ సంక్షేమ పధకాలు గెలిపించాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక, ఈ గెలుపుతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ రోజున ఈ ఫలితాల పైన వీడియో సందేశం ఇవ్వనున్నారు. అయితే, టీడీపీ ఎన్నికల బహిష్కరణ చేసామని చెబుతున్నా..అప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియటం.. ఇప్పుడు ఏడు జెడ్పీటీసీలు గెలవటంతో ఎన్నికలను ఎలా బహిష్కరించినట్లని వైసీపీ ప్రశ్నిస్తోంది.
Recommended Video
చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా.
.కానీ, ఈ ఫలితాలు మాత్రం టీడీపీని పల్లెల్లో రాజకీయంగా దెబ్బ తీసేవే అనే చర్చ మొదలైంది. ఇక, ఇప్పుడు వైసీపీ నేతలకు..వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా బలాన్ని పెంచేవిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ముందుగానే రానున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసే పనికి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కోవటానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఎటువంటి కార్యాచరణ సిద్దం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.