బాబుపై ఓ కన్నేసి ఉంచండి.., ఆ టైమ్లో అలా చేయొచ్చు: ఈసీకి విజయసాయి ఫిర్యాదు
హైదరాబాద్: రాష్ట్రంలో వైసీపీ నేతల ఓట్లు తొలగిస్తున్నారని అంబటి రాంబాబు లాంటి వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడుతుందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. శుక్రవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
Recommended Video


అవినీతి డబ్బుతో కొనేస్తున్నారు..:
ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆ అవినీతి డబ్బుతోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటోందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

ఆ టైమ్లో..:
రాజ్యసభ ఎన్నికల సమయంలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలనే కుట్రతోనే టీడీపీ వ్యవహరిస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తమ నేతలపై తప్పుడు కేసులు పెట్టకుండా ఒక ప్రత్యేక పరిశీలకుడిని నియమించి ఎన్నికలను పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

ఇంకో నలుగురికి గాలం..:
తమ పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మందిని రూ. 10 నుంచి 20 కోట్లు ఆశజూపి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మిగతా 44 మందిలో మరో నలుగురికి గాలం వేయాలనుకుంటోందని, ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆఫర్ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.

కన్నేసి ఉంచండి..:
రాజ్యసభ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లను ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో పెట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే కేంద్ర బలగాలతో ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని కూడా కోరినట్టు చెప్పారు. గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఇరుకున్నారని గుర్తుచేస్తూ.. ఏపీ ప్రభుత్వ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కేంద్రం నిఘా పెట్టాలని కోరినట్టు వెల్లడించారు.












Click it and Unblock the Notifications