ఆ ఎన్నికల కోసం వైసీపీ ప్రిపేర్: అభ్యర్థులు వీరే: సీఎం సొంత సామాజిక వర్గానికే
అమరావతి: రాష్ట్రంలో మరో ఎన్నికకు తెర లేచింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా ఈ ఎన్నికలు జరుగనున్నాయి. 2019 తరువాత రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లోనూ తిరుగులేని మెజారిటీతో విజయాన్ని సాధించింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడిక దీన్నీ ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. తిరుపతి లోక్సభ, బద్వేలు, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల్లోనూ విజయఢంకా మోగించింది.

గ్రాడ్యుయేట్ స్థానాలకు..
ఇప్పుడిక ఈ ఎన్నికలను కూడా ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోంది. ఇందులో భాగంగా- అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అవే- శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎన్నికలు వైసీపీకి ప్రజల్లో బలబలాలను మరోసారి నిరూపించబోతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల రాష్ట్ర పర్యటనల మధ్య ఈ ఎన్నికల సమరానికి అధికార పార్టీ సై అంటోంది. ఈ ఎన్నికలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్టీ నేతలతోనూ సమావేశం అయ్యారు.

రిటైర్ అయ్యేది వీరే..
ప్రస్తుత ఏపీ శాసనమండలిలో గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీలుగా ఉన్న ముగ్గురు సభ్యుల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29వ తేదీ నాటికి ముగియనుంది. ముగ్గురు పట్టభద్రుల ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. వారిలో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు నియోజకవర్గం నుంచి ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ తరఫున వై శ్రీనివాసులు రెడ్, అనంతపురం-కడప-కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ సభ్యుడు వెన్నపూస గోపాల రెడ్డి, విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన మాధవ్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.

అభ్యర్థులు ఖరారు..
ఈ మూడు నియోజకవర్గాలకు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తాజాగా అభ్యర్థులను ఖరారు చేసింది వైఎస్ఆర్సీపీ. విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం నియోజకవర్గానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ పేరును ప్రకటించింది. ఈ మూడు స్థానాలకు వైసీపీకి అత్యంత కీలకమైనవి. విశాఖపట్నాన్ని రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన అనంతరం అక్కడ ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని వైసీపీ భావిస్తోంది.

కీలకంగా..
ప్రస్తుతం ఈ స్థానం బీజేపీ ఆధీనంలో ఉంది. ఎమ్మెల్సీ మాధవ్ ఇక్కడ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఈ స్థానాన్ని బ్రాహ్మణ అభ్యర్థికి ఖరారు చేసింది. అనంతపురం-కడప-కర్నూలు నియోజకవర్గానికి వెన్నపూస రవీంద్ర రెడ్డి పేరును ప్రతిపాదించింది. ప్రస్తుత శాసనమండలి సభ్యుడు గోపాలరెడ్డి కుమారుడే ఆయన. ఇక చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాం ప్రసాదరెడ్డి పేరును ఖరారు చేసింది.

మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయం..
ఉత్తరాంధ్ర-కోస్తా-రాయలసీమ జిల్లాలకు జరిగే ఎన్నికలు కావడం వల్ల.. ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందనేది దీనిద్వారా స్పష్టమౌతుందని వైఎస్ఆర్సీపీ అగ్రా నాయకత్వం భావిస్తోంది. జగన్ సర్కార్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయం ఈ ఎన్నికల ద్వారా ప్రస్ఫూటమౌతుందని అంచనా వేస్తోంది. తిరుపతి లోక్సభ, బద్వేలు, ఉదయగిరి ఎన్నికలను ఏకపక్షం చేసినట్టే.. దీన్ని కూడా అదే స్థాయిలో గెలుచుకోవాలనే పట్టుదల పార్టీ నేతల్లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications