వైఎస్ జగన్ ప్లాన్ బీ
YS Jagan Mohan Reddy: ఈ నెల 11వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం నిర్వహించబోతోన్న మూడోసారి అసెంబ్లీ భేటీ కాబోతోంది. ఇవి బడ్జెట్ సమావేశాలు.
ఇప్పటివరకు జరిగిన రెండు సమావేశాల్లోనూ బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు చంద్రబాబు-పవన్ కల్యాణ్ కూటమి సర్కార్. ఇప్పటివరకు పూర్తిస్థాయి బడ్జెట్ను సభకు సమర్పించలేదనే విషయం తెలిసిందే. వాటిని వాయిదాలు వేస్తూ వచ్చింది. మలి భేటీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపిందంతే. ఇప్పుడు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది.

ఈ సమావేశాలకు హాజరు కాకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ సెషన్స్కు కూడా దూరంగా ఉండనుంది. 40 శాతం ఓట్లు ఉన్నప్పటికీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం, తమ పార్టీకి ప్రతిపక్షంగా గుర్తించకపోవడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్వహించిన తొలి అసెంబ్లీ భేటీలో వైఎస్ జగన్ సహా, ఆ పార్టీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాతి సమావేశాన్ని బహిష్కరించారు. అదే విధానాన్ని బడ్జెట్ భేటీల విషయంలోనూ కొనసాగించనున్నారు.
అసెంబ్లీకి వెళ్లకపోయినప్పటికీ ప్రతిరోజూ అధికార సంకీర్ణ కూటమి వైఫల్యాలను ఎండగడుతూ ఉంటామని వైఎస్ జగన్ వెల్లడించారు. అసెంబ్లీలో ఓ ప్రతిపక్ష పార్టీ ఎలాంటి పాత్రను పోషిస్తుందో.. అలాంటి పాత్రను జనం మధ్య నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ప్రతిరోజూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ప్రతి మూడో రోజు తాను స్వయంగా మీడియా సమక్షానికి వస్తానని, దీని ద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తాననీ తేల్చి చెప్పారు. మీడియా ప్రతినిధులే తనకు స్పీకర్లుగా ఉంటారని నమ్ముతున్నట్లు జగన్ పేర్కొన్నారు. ప్రజల కోసం, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications