ఓటర్లు వెధవలు- డబ్బుకు అమ్ముడుపోతారు- వాళ్లను కొనేద్దాం: టీడీపీ సీనియర్ నేత వీడియో లీక్
Komati Jayaram: ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ కుట్రలు, కుతంత్రాలు వెలుగులోకి వస్తోన్నాయి. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ఓటర్లను ఎంతగా ప్రలోభాలకు గురి చేయడానికి సిద్ధ పడిందో తెలియజేసే వీడియో లీక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఓటర్లను వెధవలుగా సంబోధించారు తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం యూఎస్ సెల్ కోఆర్డినేటర్ కోమటి జయరాం. వాళ్లు డబ్బుకు పోతారని స్పష్టం చేశారు. 5 నుంచి 10 కుటుంబాల వారిని డబ్బుతో కొనడానికి విదేశాల్లో నివసించే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

ఈ వెధవ మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వెయ్యడు అనే విషయం మనకు తెలుసునని, వాడిని మార్చడంలో మన నైపుణ్యాన్ని ఉపయోగించాలని కోమటి జయరాం అన్నారు. అలాంటి కుటుంబాలు మన ఊరిలో వెయ్యి మంది వరకు ఉంటారని, టీడీపీకి ఓటు వేయని వారిని ఏరకంగానైనా టీడీపీ వైపు మార్చాలని సూచించారు.
వాడికీ (ఓటరు) పిల్లలు ఉంటారు, పెళ్లాం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏమిటో తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక్క ఫ్యామిలీ మారితే నాలుగైదు ఓట్లు మారిపోతాయి. ఇలా ఒక్కో నియోజకవర్గంలో 1,000 ఓట్లను మార్చగలగాలి. అంత దూరం (విదేశాలు) నుంచి ఇక్కడికి వచ్చినందుకు టీడీపీకి న్యాయం చేసిన వాళ్లం అవుతాం.. అని జయరాం అన్నారు.
ఒకవేళ ఆ ఓటర్లను డబ్బుతో మార్చగలిగితే రెండు మూడు లక్షల రూపాయలను ఖర్చు పెట్టుకోగల ఆర్థిక స్థోమత తమకు ఉందని కోమటి జయరాం తేల్చి చెప్పారు. ఓటర్లను డబ్బుతో కొనడానికి అవసరమైన రెండు, మూడు లక్షల రూపాయలను ఖర్చు పెట్టే స్థోమత ఈ టీడీపీ ఎన్నారై విభాగం సమావేశానికి వచ్చిన వారికి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల రోజులు కష్టపడటానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని సుమోటోగా తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోపై వైసీపీకి చెందిన కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మండిపడ్డారు. విదేశాల్లో నివసించే వారిని టీడీపీ రాష్ట్రానికి రప్పించి ఓటుకు 10,000 రూపాయలను ఖర్చు పెట్టిస్తోందని విమర్శించారు.
ఎన్ఆర్ఐలు గ్రామాలకు వచ్చి ఇలాంటి ప్రచారం చేస్తే మోసపోవద్దని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వాళ్ల విష ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు సూమోటో కేసులు ఫైల్ చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications