జగన్ హెలిప్యాడ్ కోసం రైతుల భూమి లాక్కున్నారా ? అసలేం జరిగింది ?
ఏపీలో అధికార కూటమి, విపక్ష వైసీపీ (ysrcp) మధ్య రాజకీయ మాటల యుద్దం పతాకస్థాయికి చేరుతోంది. ఇందులో భాగంగా వాస్తవాలను సైతం పక్కనబెట్టి నేతలు ప్రత్యర్దులపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ హెలిప్యాడ్ (ys jagan helipad) కోసం తాడేపల్లిలోని తన ఇంటి పక్కన రైతుల భూమి లాక్కున్నారంటూ చేసిన విమర్శలు సంచలనం రేపాయి. దీనిపై వైసీపీ ఇవాళ ఘాటుగా స్పందించింది. ఆధారాలతో సహా వాస్తవాల్ని బయటపెట్టింది.
వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిలో హెలీప్యాడ్ కోసం రైతు భూమిని బలవంతంగా లాక్కున్నారంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ మంగళగిరి ఇన్ ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఫైర్ అయ్యారు. దశాబ్దాలుగా రైల్వే ఆధీనంలో ఉన్న ఆ భూమిని ఏ రైతు సాగుచేసిన ఆధారాల్లేవని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందునే.. వైయస్సార్సీపీపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అబద్దాలతో ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని నిలదీశారు.

తాడేపల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా హెలీప్యాడ్ నిర్మించిన ఆ భూమి చరిత్ర తనకు పూర్తిగా తెలుసన్నారు. హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన స్థలం మొదట రైల్వే సంస్థకు చెందినదని, ఆ తర్వాత దానిని 'ఈఐడీ ప్యారీ లిమిటెడ్' అనే ఎరువుల కంపెనీకి లీజుకు ఇచ్చారని తెలిపారు. ఆ కంపెనీ మూతపడ్డాక ఆ స్థలాన్ని వేలంలో వేరొకరు పాడుకున్నారన్నారు. రికార్డుల ప్రకారం అది ఇప్పటికీ రైల్వే, ప్రభుత్వ భూమిగానే ఉందన్నారు. అక్కడ ఎప్పుడూ వ్యవసాయం జరగలేదని, రైతులు సాగు చేయలేదని తేల్చిచెప్పారు. సర్వే నంబరు 223/226/సి2 లలోని 10.04 ఎకరాల స్థలం 2015లోనే (టీడీపీ హయాంలోనే) కలెక్టర్ ఆధీనంలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయని, 2015లో ఆర్.సి. నంబర్ 22/7 ప్రకారం ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాకముందే అది ప్రభుత్వ భూమిగా ఉన్నప్పుడు, తాము రైతును మోసం చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. నిబంధనల ప్రకారమే అప్పుడు హెలిప్యాడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications