సీఎం జగన్ పట్టు బిగిస్తారా, సీన్ ఛేంజ్ - పొత్తుల వేళ గోల్డెన్ ఛాన్స్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. అనూహ్యంగా జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీతో పొత్తుతో వెళ్లాలని టీడీపీ భావిస్తున్న వేళ..ఒక్క సారిగా ఢిల్లీ కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు నిర్ణయించారు. ఆ సమావేశాల్లో కేంద్రం కీలక బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. ఆ బిల్లుల ఆమోదంలో వైస్సార్సీపీ పాత్ర ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
మారుతున్న సమీకరణాలు : బీజేపీ అధినాయకత్వం టార్గెట్ 2024 ఎన్నికల కోసం మాస్టర్ స్కెచ్ సిద్దం చేస్తోంది. కీలక నిర్ణయాలకు పార్లమెంట్ వేదికగా సిద్దమవుతోంది. ఇందు కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు, యూసీసీ, మహిళా బిల్లులను ఆమోదం పొందేలా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ఎన్డీఏ పక్షాలతో పాటుగా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కోరుకుంటోంది. ఇప్పటి వరకు పలు సందర్భాల్లో వైసీపీ పార్లమెంట్ లో కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు మద్దతు ఇచ్చింది. వర్షాకాల సమావేశాల్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వైసీపీ అండగా నిలిచింది. అయితే, ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ ను ఎదుర్కొనేందుకు టీడీపీ పొత్తుల దిశగా అడుగులు వేస్తోంది.
బిల్లులకు వైసీపీ మద్దతిచ్చేనా : తాజాగా ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు పొత్తులపైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పరోక్షంగా బీజేపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించారు. అయితే, ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు పై బీజేపీ అధికారికంగా స్పందించలేదు. అటు కేంద్రంలో బిల్లుల ఆమోదం సమయంలో వైసీపీ సహకరిస్తుంది. రాజ్యసభలో వైసీపీకి ఉన్న 9 మంది సభ్యులు బీజేపీకి పెద్దల సభలో బిల్లుల ఆమోదానికి కీలకంగా మారారు.
ఇక, ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న టీడీపీతో బీజేపీ జత కట్టటం ఖాయమైతే ఈ బిల్లుల విషయంలో జగన్ పట్టు బిగించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మద్దతుపై బీజేపీ ముఖ్యులు స్పందిస్తే, ఆ సమయంలోనే టీడీపీ చేస్తున్న పొత్తు ప్రతిపాదన పైన బీజేపీ నుంచి వైసీపీకి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

జగన్ నిర్ణయం పై ఉత్కంఠ : ఇప్పుడు పార్లమెంట్ ముందు ఖాయమని చెబుతున్న ఒన్ నేషన్ - ఒన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్ సభలోని 543 స్థానాల్లో 67 శాతం మద్దతు దక్కాలి. దీంతో పాటుగా రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం దీనిని సమర్ధించాలి. దీంతో పాటుగా దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోద ముద్ర వేయాలి. లోక్ సభలో బీజేపీకి 333 సీట్లతో 61 శాతం మద్దతు ఉంది. మరో 5 శాతం ఓటింగ్ అవసరం. అక్కడ వైసీపీకి 22 మంది సభ్యులు ఉన్నారు.
అదే విధంగా రాజ్యసభలో 38 శాతం ఎన్డీఏ కూటమికి మద్దతు ఉంది. అక్కడా వైసీపీ మద్దతు కీలకం. బీజేపీ పది రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ బిల్లులు ఆమోదం పొందాంటే 14 రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంది. ఆ సమయంలోనూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం కీలకం కానుంది. దీంతో, బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్న వేళ..కేంద్రానికి వైసీపీ మద్దతు..సీఎం జగన్ వ్యవహరించే తీరుపైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications