వాయిదా వేసుకున్న వైసీపీ- మరో ఎదురుదెబ్బ?
YSRCP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్కు మరోసారి చుక్కెదురైంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 5వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఫీజు పోరు వాయిదా పడింది. రాష్ట్రంలో మెజారిటీ జిల్లాల్లో శాసన మండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటమే కారణం. ఫలితంగా ఈ ఉద్యమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేసుకుంది.

తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రులు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ఆరంభమైంది. ఈ నెల 10వ తేదీవరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు.
11వ తేదీన నామినేషన్ల పరిశీలిస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి తుది గడువు 13. 27వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ కొనసాగుతుంది. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఆరంభమౌతుంది. ఈ ఎన్నికల కోడ్.. వైసీపీ ఫీజు పోరు ఆందోళనకు తాత్కాలికంగా బ్రేకులు వేసింది.
ఫీజు పోరును నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఇదివరకే వైఎస్ఆర్సీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, దీనితో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత అంటే మార్చి 12వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
ఫీజు పోరు కోసం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి పోస్టర్లను సైతం విడుదల చేశారు. తల్లికి వందనం కింద 3,900 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తోన్నారంటూ వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.
బకాయిలు ఉన్నందున విద్యార్థులకు కళాశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాలు సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదంటూ ఆరోపిస్తోన్నారు. ఫలితంగా- ఉన్నత విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు కూలీగా మారిపోతున్నారంటూ వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19లో కూడా చంద్రబాబు ఇలాగే బకాయిలు పెడితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నిధులను విడుదల చేశారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications