వైసీపీ తీరుతో చిక్కుల్లో ఈసీ- అనవసరంగా కెలుక్కుంటున్నారా !
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు సందర్బంగా హింసను అదుపు చేయడంలో ఈసీ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. పల్నాడుతో పాటుు రాయలసీమ జిల్లాల్లోనూ అధికార వైసీపీ అడ్డూ అదుపూ లేకుండా ప్రత్యర్ధుల నామినేషన్లను సైతం అడ్డుకుంటుంటే ఈసీ తీసుకున్న చర్యలేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే అధికార పార్టీపై చర్యలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవేమో అన్న భావన ఈసీలో కనిపిస్తోంది. కానీ ఇదే పరిస్ధితి కొనసాగితే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం కోరతామని నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఈసీ ఇకపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్ధితి.
స్ధానిక పోరు హింసాత్మకం
ఏపీలో స్ధానిక ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలు కాగానే పలుచోట్ల అధికార వైసీపీ ఆధిపత్యం కోసం దాడులకు తెరలేపింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వైసీపీ దాడులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నామినేషన్లు వేసేందుకు వెళుతున్న టీడీపీ అభ్యర్ధులపై దాడులతో మొదలైన ఈ హింస.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నపైనే దాడులు చేసే వరకూ వెళ్లింది. దీనిపై స్పందించిన హోంమంత్రి టీడీపీ నేతలు ఎక్కడికైనా వెళ్లాలంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నేతలను వైసీపీ ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసినట్లు అర్దమైపోయింది.
దాడులపై ఎన్నికల సంఘం మౌనం..
ఏపీలోని పల్నాడుతో పాటు పలు ప్రాంతాల్లో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన, ఇతర విపక్షాల అభ్యర్ధులను టార్గెట్ చేసుకుని జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో ఈసీ దారుణంగా విఫలమవుతోంది. ఒకప్పుడు అభ్యర్ధులకు మద్దతుగా వెళ్లే అనుచరులపై దాడులు చేసేవారు. ఈసారి ఏకంగా అభ్యర్దులనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. అయినా ఈసీ నేరుగా స్పందించి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. స్ధానిక పోలీసు యంత్రాంగానికి వదిలిపెట్టి పైపైన పర్యవేక్షణకు మాత్రమే ఈసీ పరిమితం కావడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది.
ఈసీ మౌనంపై సర్వత్రా విమర్శలు..
ఏఫీలో స్ధానిక ఎన్నికల పోరు సందర్బంగా అధికార వైసీపీ నేతలు అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోతుంటే ఈసీ మౌనంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ మౌనం కారణంగానే వైసీపీ చాలా చోట్ల దాడులకు దిగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభ్యర్ధులపై దాడులు జరుగుతుంటే ఈసీ ఏం చేస్తోందని నిన్న హైకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది. పరిస్దితి ఇలాగే కొనసాగితే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం కోరతామని కూడా హెచ్చరించింది. అదే సమయంలో సాధారణ ఓటర్లలోనూ రాష్ట్రంలో ఎన్నికల హింసపై ఏహ్య భావన వ్యక్తమవుతోంది.
Recommended Video
అధికార పార్టీ ఒత్తిడే కారణమా?
ఏపీలోని పలు జిల్లాల్లో స్ధానిక ఎన్నికల సందర్బంగా చెలరేగుతున్న హింసను అదుపు చేయడంలో ఈసీ వైఫల్యం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంత హింత జరుగుతున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం.. నిన్న అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని చీరలు పంచుతున్నారన్న కారణంతో ఓ రోజు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.
దాడులు చేస్తున్న వారిని వదిలిపెట్టి కేవలం చీరలు పంచే వారిపై మాత్రమే చర్యలు తీసుకోవడమేంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికార వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడం ఎందుకున్న భావనతోనే ఈసీ నిర్లిప్తంగా ఉంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.