కేంద్రం పెట్రో ధరల తగ్గింపు స్వాగతించిన ఏపీ-రాష్ట్రంలో ఎప్పుడో చెప్పిన ధర్మాన
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా పెట్రోల్, డీజిల్ సహా చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెట్రోల్ పై లీటరుకు రూ.5, డీజిల్ పై లీటరుకు రూ.10 రూపాయల ధర తగ్గింది. అదే సమయంలో కేంద్రం సూచన మేరకు బీజేపీ పాలిత రాష్టాలు కూడా ఇప్పటికే భారీగా వ్యాట్ తగ్గింపులు ప్రకటిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వినియోగదారులకు ఊరట దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ సర్కార్ మాత్రం వ్యాట్ తగ్గించే విషయంలో మౌనం వహిస్తోంది.
ఏపీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. అదే సమయంలో కేంద్రం సూచనపై వ్యాట్ తగ్గించే విషయంలో వైసీపీ సర్కార్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో కూడా ఆయన చెప్పేశారు. వ్యాట్ తగ్గింపుపై వైసీపీ సర్కార్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీంతో ఇప్పట్లో వ్యాట్ తగ్గింపు లేనట్లేనని తేలిపోయింది.
మరోవైపు కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ తగ్గించకుండా మౌనం వహించడంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కేంద్రం నిర్ణయం తర్వాత ప్రస్తుతం దక్షిణాదిలో ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాట్ తగ్గించాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఇవాళ బీజేపీ నిరసనలు చేపడుతోంది. మరో విపక్షం టీడీపీ కూడా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో వైసీపీ సర్కార్ ఇరుకునపడుతోంది. అయితే వెంటనే వ్యాట్ తగ్గిస్తే భారీగా ఆదాయం కోల్పోతామన్న భయం వైసీపీ సర్కార్ లో కనిపిస్తోంది.