జమిలి వేళ జగన్ వెనుకడుగు -మిస్ "ఫైర్"..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని చెబుతూనే జగన్ కీలక అంశాల్లో వెనుకడుగు వేసారు. ప్రభుత్వం తమకు మద్దతుగా నిలుస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తుందని మండిపడ్డారు. వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అసెంబ్లీకి దూరంగా ఉండాలి.. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫలితం ఎలా ఉన్నా .. ముందుగానే అస్త్ర సన్యాసం చేయటం ఏంటనే చర్చ మొదలైంది.
ఎన్నికలకు దూరం
ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత ప్రజల్లో జరిగే తొలి ఎన్నికల నుంచి వైసీపీ తప్పుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ పట్టుదలగా వ్యవహరించి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలో తమ అభ్యర్ధిని గెలిపించుకున్నారు. అధికారంలో ఉన్న సమయంలోనూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిన జగన్.. ఇప్పుడు అసలు పోటీ నుంచే తప్పుకున్నారు. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనిపించడంలేదని చెబుతున్నారు.

జగన్ నిర్ణయం వెనుక
ఓటర్లు ప్రశాంతంగా బయటికి వచ్చి ఓటేసే పరిస్థితి లేదనేది ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం వెనుక కారణంగా చెప్పుకొచ్చారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టటం ఎందుకనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుందని అందుకు నిరసనగా తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏం చేసినా..ఎన్నికల బరిలోకి దిగి పోరాటం చేయటం ద్వారానే కేడర్ లో పట్టుదల పెరుగుతుందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. కూటమికి పట్టు ఉన్న జిల్లాల్లో.. వైసీపీ ఒక్క సీటు కూడా గెలవని జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ...వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా ముందు గానే బరి నుంచి తప్పుకోవటం పైన పార్టీలో చర్చ మొదలైంది.
ఎందుకీ నిర్ణయాలు
అదే విధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం లేదని జగన్ వెల్లడించారు. తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించని కారణాన్ని వివరిస్తూ..తమకు మైక్ ఇవ్వరని, మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని జగన్ చెప్పుకొచ్చారు. మీడియా సమావేశాల ద్వారా అసెంబ్లీ లేని సమయంలోనూ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అయితే, అసెంబ్లీకి వెళ్లి మైకు ఇవ్వకపోతే అక్కడే నిరసన తెలియచేయటం ద్వారా అధికార పక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వైసీపీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే అసెంబ్లీకి వెళ్లనని చెప్పటం .. అటు ఎన్నికల కు దూరంగా ఉండటం.. జమిలి ఖాయమని భావిస్తున్న వేళ ఎంత వరకు పార్టీకి మేలు చేస్తాయనేది ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications