చీరేస్తా అంటూ ఎంపీడీఓపై వైసీపీనేత వీరంగం; జగన్ రెడ్డి మార్గనిర్దేశనమట.. టీడీపీ టార్గెట్
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేత ఓ మహిళా ఉద్యోగి పట్ల అనుచితంగా వ్యవహరించడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారంగా మారింది. ఓ ఎంపీడీవో ను చీరేస్తా అంటూ వైసీపీ నేత బెదిరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ ఛాంబర్ లోనే ఓ దళిత ఎంపీడీవోపై నల్లలచెరువు మాజీ సర్పంచ్ ఏకవచనంతో రెచ్చిపోయారు. చీరేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక వైసీపీ నేత తీరును తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తుంది.

నలుగురు వాలంటీర్లను తొలగించిన ఎంపీడీఓ.. వైసీపీ నేత వీరంగం
ఇంతకీ ఏం జరిగిందంటే తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు వాలంటీర్లను ఎంపీడీవో విజయ తొలగించారు. ఈ వ్యవహారంలో ఎంపీడీవో విజయ వద్దకు వచ్చిన నల్లల చెరువు మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుడు వాసంశెట్టి తాతాజీ ఆమెను టార్గెట్ చేశారు. తాము చెప్పిందే చెయ్యాలి అంటూ ఆమెను బెదిరించారు. మేము చెప్పిన మాట మీరు వినడం లేదు, మా మాట వినకపోతే చీరేస్తాం అంటూ ఎంపీడీవోపై విరుచుకుపడ్డారు. కార్యాలయ సూపరింటెండెంట్ వద్దని వారిస్తున్నప్పటికీ వినకుండా రెచ్చిపోయారు.

తనను దుర్భాషలాడిన వైసీపీ నేతల తీరుతో కన్నీటి పర్యంతం అయిన ఎంపీడీఓ
వైసిపి నేత తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఎంపిడిఓ కె ఆర్ విజయ కన్నీటిపర్యంతమయ్యారు. తన కార్యాలయంలోకి వచ్చి తనను బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. నియోజకవర్గంలో ఉన్న గ్రూపు తగాదాల వల్ల తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించి వైసీపీ నేతలు తనను టార్గెట్ చేస్తున్నారని, గ్రూప్ తగాదాల వల్ల తాను ఇబ్బంది పడుతున్నారని ఆమె చెబుతున్నారు. వాలంటీర్లు సరిగా పనిచేయడం లేదని వచ్చిన ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపి నలుగురు వాలంటీర్లను తొలగించినందుకు జడ్పీటీసీ సభ్యుడు జి శ్రీనివాసరావు సైతం తనను దూషించారని పేర్కొన్నారు.
ఆర్డీఓకు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీడీఓ విజయ
ఇక తాజాగా వైసిపి నేత కార్యాలయానికి వచ్చి బెదిరించారని ఎంపీడీవో విజయ అమలాపురం ఆర్డీవో కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని వైసీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా పని చేయించాలని చూస్తున్నారని, అది తాను ఒప్పుకోకపోవటంతో గత కొన్ని నెలలుగా ఎంపీడీవో పై ఆ నేతలు కక్షగట్టి, లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్టు ఎంపీడీవో విజయ పేర్కొన్నారు. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు పోలీసులు జడ్పిటిసి సభ్యులు శ్రీనివాసరావు, మాజీ సర్పంచి తాతాజీ, కె రామకృష్ణతో పాటుగా మరో వైసీపీ నేత మేడిశెట్టి శ్రీనివాస రావు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమలాపురం డీఎస్పీ వెల్లడించారు.

వైసీపీ నేత తీరుపై టీడీపీ టార్గెట్ .. జగన్ పేరు లాగి మరీ ఆగ్రహం
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసి మరీ వైసిపి నేతల తీరును ఎండగడుతుంది. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు వాలంటీర్లను ఎంపీడీవో విజయ తొలగించారని, ఈ విషయమైరెచ్చిపోయిన వైసీపీ నేత, నల్లల చెరువు మాజీ సర్పంచ్ వాసంశెట్టి తాతాజీఅసభ్యంగా చీరేస్తా అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడని పేర్కొన్న టిడిపి, వైసీపీ నేతల బలుపు ఇది.
మహిళల పట్ల వీళ్ళ మాటలు వింటే... వీళ్ళ కుటుంబాలలో మహిళలు ఎవరూ ఉండరేమో అనిపిస్తుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. వాళ్ల ఇళ్లల్లో మహిళలు ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వీళ్ళను చూసి అసహ్యించుకుంటూ ఉంటారేమో అనిపిస్తుందని పేర్కొన్నారు. జగన్ రెడ్డి తన పార్టీ నేతలకు చేసే మార్గ నిర్దేశనం అలాంటిది మరి అంటూ జగన్ ను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications