కడప గడ్డపై వైసీపీ జెండా: వైసీపీ ఖాతాలో జిల్లా పరిషత్.. ఆకేపాటికి ఛైర్మెన్గా ఛాన్స్
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా జడ్పీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. 50 జడ్పీటీసీ స్థానాలున్న కడపలో ఇప్పటికే 35 జడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగితా 15 సీట్లలో కూడా వైసీపీనే ఎక్కువ సీట్లను దక్కించుకునే అవకాశం ఉంది.
కాగా, స్థానిక సమరంలో తొలి విజయం కడప నుంచే మొదలైనట్లయింది. జిల్లా పరిషత్ ఛైర్మన్గా వైసీపీ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎన్నికయ్యే అవకాశం ఉంది. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజాంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2012లో వైసీపీలో చేరి ఉపఎన్నికలో గెలిచారు.
కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆకేపాటి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్లిఖార్జున రెడ్డి చేతిలో ఆకేపాటి ఓటమిపాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి ఆకేపాటికి సీటు దక్కలేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన మల్లిఖార్జున రెడ్డికి సీటు కేటాయించారు జగన్.
ఈ క్రమంలో న్యాయం చేస్తానని ఆకేపాటికి జగన్ హామీ ఇచ్చారు. నాటి జగన్ హామీ మేరకు తాజాగా, కడప జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది.
ఇది ఇలావుండగా, పులివెందల పరిధిలో కూడా టీడీపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇప్పటికే రాయలసీమలో డోన్ మున్సిపాలిటీని వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి జడ్పీటీసీ వైసీపీ దక్కించుకుంది. కుప్పంలో అత్యధిక ఎంపీటీసీలను వైసీపీనే గెలుచుకుంది.