జగన్ కారు ఢీకొట్టలేదు..! అంతా ఫేక్..సింగయ్య మృతిపై అంబటి క్లారిటీ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు టూర్ కు వెళ్తుండగా ఆయన కారు ఢీకొని సింగయ్య అనే పార్టీ కార్యకర్త చనిపోయాడని ఇవాళ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ దృశ్యాలు చూస్తుంటే జగన్ కారు కింద పడే సింగయ్య చనిపోయాడని తెలుస్తోంది. దీంతో పోలీసులు జగన్ కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా సమాచారం. ఇదే కేసులో జగన్ ను ఏ2గా చేర్చినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేత అంబటి రాంబాబు స్పందించారు.
వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే, ఆ మరణంపై ఏ మాత్రం మానవత్వం లేకుండా ఓ వర్గం మీడియా వైసీపీపై విషం చిమ్ముతున్నాయని ఆంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైయస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో వున్న కూటమి ప్రభుత్వ కుట్రలకు ఓ వర్గం మీడియా కూడా భాగస్వామిగా మారిందన్నారు.

వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా దురదృష్టవశాత్తు వెంగళాయపాలేనికి చెందిన సింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోగా, సత్తెనపల్లిలో జయవర్ధన్రెడ్డి అనే యువకుడు వడదెబ్బ కారణంగా గుండెపోటుకు గురై మృతిచెందారని అంబటి తెలిపారు. జగన్ వాహనం కానీ, ఆయన కాన్వాయ్ వాహనాలు కానీ సింగయ్యను ఢీకొట్టలేదని ఎస్పీ స్వయంగా వెల్లడించారని తెలిపారు. కాన్వాయ్కి ముందు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఆయన ప్రమాదానికి గురైనట్టు ఎస్పీ ధ్రువీకరించారని తెలిపారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు.
జగన్ టూర్ కోసం 40 మందిని వైసీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బాలసాని కిరణ్ కుమార్ తీసుకొచ్చినట్టుగా రాసిన స్టేట్మెంట్ మీద సంతకం పెట్టమని సింగయ్య మృతదేహానికి పోస్టుమార్టం సమయంలో ఆయన భార్యను పోలీసులు ఒత్తిడి చేశారన్నారు. పోలీసులు రాసి తీసుకొచ్చిన తప్పుడు స్టేట్మెంట్ పై ఆ సమయంలో అక్కడే ఉన్న పార్టీ నాయకులమంతా అడ్డం తిరగడంతో పోలీసులు సింగయ్య భార్య, ఆమె బంధువులు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసుకుని వెళ్లిపోయారన్నారు. లేదంటే దీన్ని హత్యకేసుగా చిత్రీకరించి ఎవరో ఒకర్ని ఇరికించాలన్న కుట్ర అప్పుడే జరిగిందన్నారు.

సింగయ్య మరణం ప్రమాదవశాత్తు జరిగిందని అందరికీ తెలిసిన సత్యమని, చంద్రబాబు పర్యటనల్లోనూ చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయని అంబటి తెలిపారు. తొక్కిసలాటల్లో కూడా అమాయకులు బలయ్యారన్నారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారన్నారు. జగన్ వాహనానికి సింగయ్య బలి', 'సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం' అంటూ ప్రమాదాన్ని హత్యగా చూపించాలని క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు.
తన వాహనమే కాదు, ఆయన కళ్లముందు ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ఆస్పత్రి చేర్చేవరకు జగన్ ఊరుకోరని, అలాంటిది జగనే స్వయంగా కారేసుకెళ్లి సింగయ్యను గుద్ది చంపాడనేలా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరికో ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని జగన్, మా కార్యకర్త సింగయ్య చనిపోతే ఎలా వదిలేస్తారనుకున్నారు? అని అంబటి ప్రశ్నించారు. ఆయన కుటుంబానికి వైయస్సార్సీపీ అండగా నిలిచిందని, ఇప్పటికే వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.10 లక్షల చెక్కును పార్టీ తరఫున ఇచ్చామన్నారు.












Click it and Unblock the Notifications