అఖిలప్రియకు వైసిపి ఝలక్: నంద్యాల అభ్యర్థిని ప్రకటించిన బంధువు
నంద్యాల ఉప ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుడిని అభ్యర్థిగా నిలపడంతో పాటు, వైసిపితో చర్చలు జరిపి ఏకగ్రీవం చేసేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి అఖిలప్రియ ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుడిని అభ్యర్థిగా నిలపడంతో పాటు, వైసిపితో చర్చలు జరిపి ఏకగ్రీవం చేసేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి అఖిలప్రియ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టేలా కనిపిస్తున్నాయి.
నంద్యాలపై చక్రం తిప్పిన అఖిలప్రియ: సరేనన్న విజయమ్మ, జగన్ మాటేమిటో...
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున అఖిలప్రియ కుటుంబంతో పాటు, శిల్పా మోహన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. అయితే అఖిల మాత్రం తమ కుటుంబం నుంచి ఒకరిని బరిలోకి దింపి, వైసిపి నుంచి పోటీ లేకుండా చూసుకోవాలి భావించారు.
నీరుగార్చిన అఖిలప్రియ ఆశలు
కానీ ఆమె ఆశలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీరుగార్చింది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతారని మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత కాటసాని రామిరెడ్డి ప్రకటించారు.
కాటసానిచే ప్రకటన
టిడిపి తరఫున టిక్కెట్ రేసులో ఉన్న భూమా బ్రహ్మానంద రెడ్డి.. కాటసాని రామిరెడ్డికి స్వయానా అల్లుడు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవానికి కాటసాని, భూమా వర్గం ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారానికి కౌంటర్గా అదే కాటసానిచే వైసిపి అభ్యర్థిని ప్రకటింప చేశారు.
రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని..
ఆదివారం నంద్యాల నియోజకవర్గ ప్లీనరీ జరిగింది. ఈ ప్లీనరీలో కాటసాని రామిరెడ్డి ఆసక్తికర ప్రకటన చేశారు. వైసిపి తరఫున రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. కాటసాని అనూహ్యంగా వైసిపి అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
భూమా వర్గం నుంచి బ్రహ్మానంద రెడ్డి
త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా భూమా వర్గం తరఫున భూమా బ్రహ్మానంద రెడ్డి రేసులో ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డిని ఏకగ్రీవం చేసేందుకు టిడిపి నుంచి అఖిలప్రియ, వైసిపి నుంచి కాటసానిలు ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
పార్టీలోను అఖిలప్రియకు పోటీ
ఇప్పుడు వైసిపి నేత అభ్యర్థిని ప్రకటించడంతో.. ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకే మొగ్గు చూపుతున్నట్లుగా తేలిపోయింది. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. మొత్తానికి అఖిలప్రియ ప్రయత్నాలు ఫలించడం లేదని తెలుస్తోంది. మరోవైపు టిడిపిలో కూడా శిల్పా వర్గం నుంచి పోటీ నెలకొంది.