జగన్ హామీతో శాంతించిన బాలినేని-రాజీనామాపై వెనక్కి-వైఎస్ కుటుంబం గుర్తుకొచ్చి..
ఏపీలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పదవులు ఆశించి భంగపడ్డ వారిలో ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి కూడా ఒకరు. కేబినెట్ జాబితా బయటికి రాగానే తీవ్ర నిరాశకు గురైన బాలినేని ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. దీంతో ఆయన్ను అధిష్టానం బుజ్జగించింది.
కేబినెట్ మంత్రి పదవి దక్కదని తేలిపోవడంతో ఎమ్మెల్యే పదవి కూడా వదులుకునేందుకు బాలినేని సిద్ధమయ్యారు. మరోవైపు బాలినేనికి మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకు బుజ్జగింపులు మొదలుపెట్టారు. మూడుసార్లు బాలినేని ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. చివరకు సీఎం జగన్ వచ్చి కలవమన్నారనే సందేశం ఇచ్చారు. దీంతో బాలినేని వెనక్కితగ్గారు. సీఎం జగన్ ను కలిసేందుకు అంగీకరించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్ తో చర్చలు జరిపారు.

అనంతరం బయటికి వచ్చిన బాలినేని పూర్తిగా శాంతించారు. సీఎం జగన్ ఆలోచన ప్రకారమే మంత్రి పదవులు కేటాయించారని చెప్పుకొచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు జరిగింది ప్రచారం మాత్రమేనన్నారు. మంత్రి పదవి కోసం తానెప్పుడూ పాకులాడలేదని బాలినేని చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేశ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. గతంలో సురేశ్తో కలిసి సమన్వయంతో పని చేశానన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందన్న బాలినేని... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనన్నారు. జగన్ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తానని వెల్లడించారు.












Click it and Unblock the Notifications