ఏపీలో కరువు హెరిటేజ్కు పండుగ: చంద్రబాబు, లోకేశ్ తీరుపై జోగి పైర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేపట్టిన మజ్జిగ స్కీం ద్వారా హెరిటేజ్కు లాభం చేకూర్చుకుంటున్నారని వైసీపీ ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్లో కరువుని సైతం నిస్సిగ్గుగా కాసులుగా మార్చుకుంటున్న సీఎం చంద్రబాబు, లోకేశ్ తీరుపై ఆ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ మండిపడ్డారు.
సోమవారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితులతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం దానిని తన హెరిటేజ్ కంపెనీకి పండగగా మార్చుకుని భారీగా సొమ్ము చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
కరువును సైతం పండగగా మార్చుకుని సొమ్ము చేసుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ల తీరుని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. మండుటెండల్లో తాగునీటిని, మజ్జిగను అందిస్తామంటే ప్రజలపై ప్రేమతో ఇస్తారని అనుకున్నామని హెరిటేజ్పై అభిమానంతోనేనని ఇప్పుడు అర్థం అవుతోందన్నారు.
మజ్జిగ కోసం జిల్లాకు మూడు కోట్లు చొప్పున 39 కోట్లును కేటాయించారని ఇదంతా హెరిటేజ్ కోసమే తప్ప ప్రజల కోసం కాదని అన్నారు. రాష్ట్ర ప్రజానీకం కరువుతో అల్లాడుతుంటే విహారయాత్రలకు సీఎం బయలుదేరడం వెనుక ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ హెరిటేజ్ పెరుగును కొనుగోలు చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులు ప్రజలందర్నీ అలోచింపజేసేలా ఉన్నాయన్నారు. హెరిటేజ్ కంపెనీ నుంచి మజ్జిగ తీసుకోవాలని కొన్ని జిల్లాలలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై రమేష్ తీవ్రంగా మండిపడ్డారు.
ఇదిలా ఉంటే హెరిటేజ్ కంపెనీకి చెందిన మజ్జిగనే కొనుగోలు చేయాలంటూ విజయనగరం జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సవరించుకున్నారు. తీవ్ర ఎండలు నేపథ్యంలో ప్రభుత్వం చలివేంద్రాలను నిర్వహించాలని, అందులో మజ్జిగ కూడా సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
అంతకముందు విజయనగరం జిల్లా కలెక్టర్ అత్యుత్సాహంగా హెరిటేజ్ పెరుగు తీసుకుని మజ్జిగ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వులపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. దీంతో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో ఆ ఆదేశాలను రద్దు చేసి, కొత్త ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో హెరిటేజ్ డెయిరీతో పాటు విశాఖ డెయిరీ పెరుగును కూడా పంపిణీ చేశామని ఆ జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. విశాఖ డెయిరీ వారు విజయనగరం పట్టణంలో మాత్రమే పెరుగు ఇవ్వగమని చెప్పడంతో హెరిటేజ్ పెరుగుని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
విజయనగరం జిల్లాలో తిరుమల, జెర్సీ, విశాఖ, హెరిటేజ్ సంస్థలతో పాటు రిజిస్టర్ అయిన కో ఆపరేటివ్ సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి గతంలో ప్రకటించిన ధరకే పెరుగుని కొనుగోలు చేయాలని తాజాగా సవరించిన ఉత్తర్వులలో కలెక్టర్ పేర్కొన్నారు.