అలా వైసీపీకి రాజీనామా.. ఇలా బీజేపీలో చేరిక
YS Jagan: ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు నాయకులు. పలు జిల్లాల్లో పార్టీ ఖాళీ అవుతోంది. బడా నాయకులు సైతం గుడ్బై చెబుతున్నారు. మాజీ మంత్రులు-ఎంపీలు- ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా బయటికెళ్తోన్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి రోజుల్లోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజీనామాల పర్వం కొనసాగుతూనే వస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు.

అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వైసీపీని వీడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ విప్ సామినేని ఉదయభాను, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.. భారీ షాక్ ఇచ్చారు.
ఈ మధ్యే- మాజీ అవంతి శ్రీనివాస్, భీమవరానికి చెందిన మాజీ శాసన సభ్యుడు గ్రంధి శ్రీనివాస్ కూడా అదే బాట పట్టారు. వీరిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది. అడారి ఆనంద్ కుమార్, రాయలసీమకు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఇంతియాజ్ పార్టీకి గుడ్బై చెప్పారు.
ఇప్పుడు తాజాగా పార్టీ అధికార ప్రతినిధి కే రవిచంద్రా రెడ్డి గుడ్ బై చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆయన సొంత నియోజకవర్గం. పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. మంచి వక్తగా పేరుంది. తరచూ మీడియా డిబేట్లల్లో పాల్గొంటుంటారు. పార్టీ గళాన్ని సమర్థవంతంగా వినిపిస్తోంటారు. అంశాలవారీగా రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొడుతుంటారు.
వైఎస్ఆర్సీపీ హయాంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్గా వ్యవహరించారు. కొద్దిసేపటి కిందటే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ప్రాథమిక సభ్యత్వానికి, అధికార ప్రతినిధి హోదాకూ రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
రాజీనామా చేసిన కొద్దిసేపటికే రవిచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్డును అందజేశారు పురందేశ్వరి.












Click it and Unblock the Notifications