ఏపీ కూటమి పాలనలో కేంద్రం జోక్యం?
Vinukonda Murder: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య.. కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ఉద్యమానికి పూనుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లనుంది.
వైఎస్ఆర్సీపీ నాయకుడు రషీద్ను వినుకొండలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిలానీ నడిరోడ్డుపై నరికి చంపాడు. చేతులు నరికాడు. మెడపై పలుమార్లు కత్తితో నరికాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించారు.

దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందంటూ మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించట్లేదంటూ విమర్శించారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా పల్నాడు జిల్లాకే చెంది గురజాల వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నెలన్నర రోజుల్లో దాడలు యథేచ్ఛగా సాగుతున్నాయని అన్నారు.
అత్యాచారాలు, హత్యలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మహేష్ రెడ్డి చెప్పారు. వినుకొండ హత్యోదంతం దీనికి నిదర్శనంగా అభివర్ణించారాయన. శాంతి భద్రతలు మటుమాయం అయ్యాయని, ఇంత జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టింపుధోరణి లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఈ నెలన్నర రోజుల్లో మూడు అత్యాచారాలు, 31 హత్యలు, టీడీపీ వేధింపుల వల్ల 35 ఆత్మహత్యలు సంభవించాయని కాసు మహేష్ రెడ్డి వివరించారు. మూడు నుంచి నాలుగు వేల వరకు దాడులు జరిగాయని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం డస్ట్బిన్లో పడేసిందని, నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ను అమలు చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కాసు మహేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రషీద్ హత్యకు పాల్పడిన వారిని వదలకూడదని, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications