నరసాపురంపై మంత్రి పేర్నికి కొత్తపల్లి సుబ్బారాయుడు సవాల్ - ప్రజాభీష్టమా ? ప్రసాదరాజా ?
నరసాపురం జిల్లా కేంద్రం ఏర్పాటు వ్యవహారం వైసీపీలో చిచ్చు రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే భీమవరం జిల్లాకు నరసాపురాన్ని కాదని భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నరసాపురం మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు.. ప్రస్తుత ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుపై నిప్పులు చెరుగుతున్నారు. ఆయన్ను గెలిపించి తప్పుచేశామంటున్నారు. దీనిపై మంత్రి పేర్ని నాని నిన్న ఆయన తీరును తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. దీంతో సుబ్బారాయుడు కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
నరసాపురం జిల్లా కేంద్రం ఏర్పాటు వ్యవహారంలో ఎమ్మెల్యే ప్రసాదరాజను వెనకేస్తుకొస్తూ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కౌంటర్ ఇచ్చారు. నరసాపురం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా కేంద్రం కోరుతూ జేఏసీలు ఏర్పాటు చేసి పోరాటం చేస్తుంటే ప్రసాదరాజు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పేర్నినాని తనపై వ్యాఖ్యలు చేయడమేంటని సుబ్బారాయుడు ప్రశ్నించారు. కొత్తపల్లి సుబ్బారాయుడు అంటే ఎంటో, ప్రసాదరాజు అంటే ఏంటో నరసాపురానికి వచ్చి చూడాలని కోరారు.

నరసాపురం జిల్లా కేంద్రం విషయంలో సీఎం జగన్ తమకు న్యాయం చేస్తారని తాము అనుకుంటున్నట్లు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. సీఎం జగన్ చెప్పారని నరసాపురంలో ప్రసాదరాజును గెలిపించామని, ఇఫ్పుడు ప్రసాదరాజు స్ధానిక ప్రజాభిష్షానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాభీష్టం కావాలా ప్రసాదరాజు కావాలా అని కొత్తపల్లి సుబ్బారాయుడు మంత్రి పేర్నినానిని ప్రశ్నించారు. ఇప్పటికైనా నరసాపురానికి జిల్లా కేంద్రం వస్తుందో రాదో చెప్పాలని మంత్రి పేర్నినాని కొత్తపల్లి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications