తగ్గేది లేదు, అమరావతికి వెళ్తాం..!!
ఏపీ రాజకీయం ఇప్పుడు రాజధాని చుట్టూ తిరుగుతోంది. అమరావతి రాజధానిగా ఉంటుందని కూటమి నేతలు చెబుతుంటే.. మాజీ సీఎం జగన్ మావిగన్ ప్రతిపాదన పైన కీలక ప్రకటన చేసారు. వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడతామని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు అమరావతి గ్రామాల్లోకి వెళ్లే సమయంలో దాడి జరిగింది. కాగా.. ఇప్పుడు అమరావతి గ్రామాల్లో మరోసారి పర్యటన పైన ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పర్యటనకు వెళ్లాలని డిసైడ్ అయింది.
అమరావతి రైతులను సీఎం చంద్రబాబు మోసం చేసారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అమరావతిలో కట్టడాలకే వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అమరావతిని అప్పుల కుప్పగా మార్చుతున్నారని.. ఎప్పటి లోగా నిర్మాణాలు పూర్తి చేస్తారో చెప్పటం లేదని వ్యాఖ్యానించారు. అసలు అమరావతికి ఎంత ఖర్చు చేస్తున్నారు.. ఎంత అవసరమో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇప్పటికే రూ 50 వేల కోట్లు రాజధాని పేరుతో అప్పులు చేసారని చెప్పుకొచ్చారు. జగన్ పైన విమర్శలు చేసేందుకు.. తిట్టేందుకు ముందుకు వచ్చే మంత్రులు తమ శాఖల పని తీరు గురించి మాత్రం మాట్లాడరని మండిపడ్డారు. మావిగన్ అంటే మంత్రులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తాం
సింగపూర్ తరహా రాజధాని నిర్మాణం చేస్తామని.. చివరకు మున్సిపాల్టీ చేస్తున్నారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. రాజధానిలో పేదలకు ఇచ్చిన 50 వేల పట్టాలు రద్దు చేసారని గుర్తు చేసారు. రాజధాని పేరుతో దోపిడీ ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా కనపడుతోందని చెప్పారు. అమరావతి రైతుల ను కలిసేందుకు వెళ్తే దాడులు చేస్తారని..ఇదేం రాజకీయమని ప్రశ్నించారు. రైతుల కష్టాలు చూసేందుకు మళ్లీ అమరావతి వెళ్తాం.. రైతులను కలుస్తామని పేర్ని నాని ప్రకటించారు. అమరావతికి వెళ్తాం.. తగ్గేది లేదు.. భయపడేది లేదని వ్యాఖ్యానించారు. మావిగన్ పేరు చెబితే చంద్రబాబు అల్లాడిపోతున్నారని.. అమరావతిలో అవినీతి జరగటం లేదని రూపించాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వంలో అవినీతి తారా స్థాయికి చేరిందని విమర్శించారు.













Click it and Unblock the Notifications