పేర్ని నాని వ్యాఖ్యలపై ఏపీ జేఏసీ అమరావతి ఫైర్..!
వైసీపీ నేత పేర్ని నాని (perni nani) కృష్ణా జిల్లాలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ ఉద్యోగులు, అధికారులపై వ్యంగంగా, బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేయడంపై ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన వ్యాఖ్యల్ని ఖండించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం, ప్రజలకు అత్యవసర సేవలు అందించడం, పాలనా వ్యవస్థను సమర్థంగా నడిపించడం వంటి అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, అధికారులపై ఇలాంటి అవమానకర, బెదిరింపు వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని తెలిపింది. చట్టం తెలిసిన మాజీ మంత్రిగా అలా మాట్లాడటం బాధాకరమంది.
ప్రజా సేవలో నిమగ్నమై ఉన్న ఉద్యోగుల కుటుంబాలకే బెదిరింపులు వెళ్లే పరిస్థితి ఏర్పడటం అనేది కేవలం ఉద్యోగులను అవమానించడం మాత్రమే కాదు, వారి కుటుంబాల మనోభావాలను కూడా దెబ్బతీసేలా ఉందని జేఏసీ నేతలు తెలిపారు. ఉద్యోగులు తప్పు చేస్తే చట్టం ప్రకారం, ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులను లేదా ప్రభుత్వాన్ని కోరడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, అంతేకానీ ఈ విధంగా ఉద్యోగుల ఆత్మ అభిమానం దెబ్బ తినే విధంగా మీడియా ద్వారా ఉద్యోగులను అవమానకర, చులకన, బెదిరింపు ధోరణిలో మాట్లాడడం భావ్యం కాదని తెలిపారు.

ప్రజాప్రతినిధుల భాషకు బాధ్యత ఉండాలని, పదవులు చేపట్టినవారు, ముఖ్యంగా మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు పరిపక్వతతో, బాధ్యతతో, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా మాట్లాడాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఇప్పటికైనా ఉద్యోగులు, అధికారులు పట్ల పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక సీనియర్ రాజకీయ ప్రతినిధిగా, ప్రభుత్వంలో ఒక మంత్రివర్యులుగా పనిచేసిన ఆయన మీదే ఉందని సూచించాయి.












Click it and Unblock the Notifications