పోసానికి మరిన్ని కష్టాలు ? ఇవాళ సీఐడీ కస్టడీలోకి..!
ఏపీలో వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సినిమా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను దూషించిన వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కాగా.. వీటిపై కోర్టుల్ని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఈసారి సీఐడీ ఆయనపై నమోదు చేసిన ఫొటోల మార్ఫింగ్ కేసులో మాత్రం కస్టడీ తప్పడం లేదు. గుంటూరు కోర్టు ఆదేశాలతో సీఐడీ ఇవాళ పోసానికిని కస్టడీలోకి తీసుకుంటోంది.
గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు తయారు చేసి ప్రెస్ మీట్లోకి తెచ్చి మరీ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తాజాగా సీఐడీ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్ పై గుంటూరు కోర్టుకు తెచ్చి హాజరుపర్చి రిమాండ్ తీసుకుంది. ఇప్పుడు పోసానికి ఇవాళ ఒక్క రోజు పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీఐడీ ఇవాళ ఆయన్ను రిమాండ్ నుంచి అదుపులోకి తీసుకుంటోంది.

ఇవాళ సీఐడీ కస్డడీలో పోసాని కృష్ణమురళికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోల్ని ఎవరు మార్ఫింగ్ చేసి ఇచ్చారు, లేదా ఆయనే మార్ఫింగ్ చేశారా, చేస్తే ఎవరి ప్రోద్భలంతో ఇలా చేసారన్న దానిపై విచారించబోతున్నారు. ఇందులో పోసాని చెప్పే విషయాల ఆధారంగా ఈ కేసులో సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. గతంలో వైసీపీ నేత సజ్జల ప్రమేయంపై ఓసారి వాంగ్మూలం ఇచ్చిన పోసాని.. ఈసారి ఎవరి పేర్లు బయటపెట్టబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications